Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీం.. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలోనే మహారాష్ట్రలోని సోలాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. అందులో భాగంగానే సభ నిర్వహణ కోసం బాల్కోటి మైదానం, ఈద్గా మైదానాలను మంత్రులు హరీశ్రావు, మహముద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జీ కల్వకుంట్ల వంశీధర్రావు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పరిశీలించారు. మార్కండేయ ఆలయంలో మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు అందుతున్న సకల సౌకర్యాలను చూసి అటువంటి విధానాలు తమకూ కావాలని మహారాష్ట్ర రైతులు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర సర్కార్ తెలంగాణ మోడల్ను అమలు చేయకపోతే త్వరలో అక్కడ ఏర్పడే బీఆర్ఎస్ సర్కారే నూటికి నూరుపాళ్లు తెలంగాణ మోడల్ను అమలు చేసి తీరుతుందని హరీశ్రావు స్పష్టం చేశారు. 14 ఏండ్లు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ ఇవ్వాళ దేశానికే మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందన్నారు. మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఏయే టీమ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు. రైతులపై మహారాష్ట్ర సర్కార్కు నిజమైన ప్రేమ ఉంటే ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
పద్మశాలీయుల ఆరాధ్యదైవం మార్కండేయ ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తోడ్పాటును అందిస్తుని మంత్రి హరీశ్రావు చెప్పారు. సోలాపూర్లో రాఖీపౌర్ణమిని పురష్కరించుకొని మార్కండేయ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు నిర్వాహకులు తమను ఆహ్వానించటమే కాకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రూ. 1 కోటి రూపాయలను సాయంగా అందిస్తామని ప్రకటించారు. 100 ఏండ్లుగా కొనసాగుతున్న మార్కండేయ రథోత్సవంలో పాల్గొనడం తమకు గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు మంత్రి హరీశ్రావు.