మెదక్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
అమిత్ షా నిన్న తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే ఆయన నిజంగానే అమిత్ షా కాదు అబద్దాల షా అని రుజువు చేసుకున్నారని ధ్వజమెత్తారు. నడ్డానేమో అబద్ధాలకు అడ్డగా, అమిత్ షానేమో అబద్ధాలకు బాద్ షాగా నిరూపించుకున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా? అని హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా తుప్రాన్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ అని నిప్పులు చెరిగారు. అబద్ధాలను ప్రచారం చేయండి అని అమిత్ షానే స్వయంగా గతంలో చెప్పారని గుర్తు చేశారు. అబద్ధాలు పబ్లిక్గా చెప్పే పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీజేపీనే అని పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. అమిత్ షా కాస్త అసత్యాల షాగా మారిపోయాడు. అలవోకగా అబద్ధాలు ఆడిండు. ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు ఇంత అలవోకగా అబద్ధాలు మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అమిత్ షానే. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. అమిత్ షా మాట్లాడమే అబద్ధాలు మాట్లాడాతారా అనే సందేహం కలిగిందని హరీశ్రావు పేర్కొన్నారు.
అమిత్ షా హైదరాబాద్కు వచ్చి మాట్లాడిన ప్రతిమాటలో అబద్ధం ఉందని హరీశ్రావు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇది గుజరాత్ కాదు.. ఇది అమాయక తెలంగాణ కాదు.. ఇది పోరాటాల గడ్డ. ఉద్యమించి సాధించుకున్న ఈ తెలంగాణలో నీ అబద్ధాలు నడవవు. నీ అబద్ధాలు నీ గుజరాత్లో నడుస్తాయేమో.. నీ అబద్ధాలతో నీవు అక్కడ గెలుస్తవేమో కానీ.. ఇక్కడ నీ అబద్ధాలు నడవవు. నీ గోల్ మాల్ ప్రచారానికి, నీ అబద్ధాలకు తెలంగాణలో స్థానం లేదని హరీశ్రావు తేల్చిచెప్పారు.