హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన పల్లెప్రగతి వంటి కార్యక్రమాల విజయానికి ఈ అవార్డులు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.
తెలంగాణ పట్ల వివక్షచూపుతున్న కేంద్రానికి ఇక్కడి ఆదర్శవంతమైన పాలనను గుర్తించడం మినహా వేరే మార్గం లేదని అన్నారు. మన పని దేశం మొత్తం కనిపిస్తున్నదని స్పష్టంచేశారు. తెలంగాణలోని 5 జిల్లాలు 5 స్టార్ ర్యాంకింగ్ సాధించాయని, మొత్తం 499 గ్రామాలు వివిధ విభాగాల్లో స్వచ్ఛ గ్రామాలుగా గుర్తింపు పొందాయని వివరించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, డంప్యార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అనేక అంశాల్లో తెలంగాణ గ్రామాలు రోల్మాడల్గా నిలిచాయని తెలిపారు.