ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు.. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనబుద్ధిని చాటుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీలం తుఫాన్ వస్తే.. గుంటూరు, కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పటి ముఖ్యమంత్రి చాంబర్ ముందు ధర్నా చేస్తే మా కాళ్లను తొక్కుకుంటూ వెళ్లాడు. కానీ రైతులపై మాత్రం కనికరం చూపలేదు.
-మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రైతుబంధుపై కాంగ్రెస్వి అన్నీ డ్రామాలేనని మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రైతుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమలన్నీ ప్రజలకు తెలుసని, ఈ నెల 30న ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని, కాంగ్రెస్ హస్తాన్ని అడ్డుపెట్టి రైతుబంధును ఆపలేరని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే అక్టోబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారని, యాసంగికి రైతుబంధు ఇవ్వకుండా అడ్డుకోవాలని దరఖాస్తు చేశారని చెప్పారు.
ఈ విషయాన్ని ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని తాము కలిసి రైతుబంధు కొత్త పథకం కాదని, ఇప్పటికే 11 సార్లు రైతుబంధు వేశామని వివరించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వెంటనే ఎన్నికల సంఘం బీఆర్ఎస్కు కొమ్ముగాస్తున్నదని, 4 రోజుల ముందు రైతుబంధు ఎట్లా ఇస్తారని, బీజేపీ, బీఆర్ఎస్, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కయ్యాయని రేవంత్రెడ్డి ఆరోపించారని గుర్తుచేశారు. నిజంగా రైతులమీద ప్రేమే ఉంటే రైతుబంధును రేవంత్రెడ్డి ఆహ్వానించేవారని, కానీ ఎందుకు అనుమతిస్తారని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసేవారు కాదని అన్నారు.
రైతుబంధు అనుమతిని ఉపసంహరించుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. రైతుల అకౌంట్లలో రైతుబంధు పడే సమయంలో రైతుల నోట్లో కాంగ్రెస్ మట్టికొట్టిందని మండిపడ్డారు. దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కొత్త డ్రామాలు మొదలు పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ తీరు..‘వంద ఎలుకలు తిన్న పిల్లి నేను శాఖాహారిని’ అన్నట్టు ఉన్నదని చెప్పారు. మాజీ పీసీసీ అధ్యక్షుడేమో రైతుబంధు దుబారా అంటున్నారని, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడేమో రైతుబంధు బిచ్చమేస్తున్నడని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, అందుకే దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలో ఎంతోమంది ప్రధానులు, సీఎంలు ఉన్నారని, కానీ ఎవరైనా రైతులకు ఒక్కరూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా రైతేనని, అందుకే కరోనావంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్పెట్టి మరీ రైతుంబధు పైసలు ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్కు రైతులంటే ఎప్పుడూ గిట్టదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసిందని మండిపడ్డారు. ఎరువులు దొరకక రైతులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పారు. నకిలీ విత్తనాలతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామని 2009లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని, కానీ ఆ తర్వాత ఆ మాటను మరిచిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో చెరువులను పట్టించుకున్నది లేదని, చెక్డ్యామ్లు కట్టింది లేదని, ప్రాజెక్టులు పూర్తి చేసిందిలేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రైతులను రాచి రంపాన పెట్టిందని గుర్తుచేశారు.
ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న నాయకుడికి ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వారసుడని, అందుకే ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడని హరీశ్రావు తెలిపారు. రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటే చాలని, కావాలంటే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెప్తున్నాడని మండిపడ్డారు. రైతుబంధు బిచ్చమంటూ రైతులను అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 50 ఏండ్ల పాలనలో రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కొత్తగా రైతులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే.. నియోజకవర్గాల్లో బాండ్లు రాసిస్తున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో ఒకాయన పసుపుబోర్డు తెస్తానని ఇట్లనే బాండ్లు రాసిచ్చారని, అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద బాండ్లు రాసిస్తున్నదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోనూ బాండ్లు రాసిచ్చారని, ఐదు గ్యారెంటీలని రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఊదరగొట్టారని.. ఆ తర్వాత ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుందని, కానీ ఆ గ్యారెంటీల ఊసేలేదని చెప్పారు. కరెంట్ కోతలు, స్కాలర్షిప్లో కోతలు, రైతుబంధు రద్దు.. ఇవీ కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారెంటీలని ఎద్దేవా చేశారు. కర్ణాటక రైతుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు అయ్యిందని అన్నారు. గతంలో 9 గంటల కరెంట్ వస్తే, ఇప్పుడు 5 గంటల కరెంట్ కూడా రావడం లేదని చెప్పారు. ఎంబీబీఎస్, పీజీ, లా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లో 80 శాతం కోత విధించారని పేర్కొన్నారు. యువశక్తిని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, 100 రోజుల్లో 2 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని రాహుల్గాంధీనే స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరునెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఇస్తే అతని పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్రెడ్డి ఎన్నడైనా బీజేపీని, నరేంద్ర మోదీని పల్లెత్తు మాటైనా అన్నారా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కై తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిచేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా రైతులను మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీలేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు వ్యతిరేక పార్టీలేనని దుయ్యబట్టారు. బోరు బాయిలకాడ మీటర్లు పెట్టాలని బీజేపీ చెప్తే.. మీటర్లు పెట్టి పైసలు తెచ్చుకొన్నది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్లో మోటర్లకు మీటర్లు పెట్టారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోనూ బోరుబాయిల కాడ మీటర్లు పెడతామని అసెంబ్లీలో బిల్ పాస్ చేశారని హరీశ్రావు తెలిపారు. మరి రేపు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో బోరు బాయిలకాడ మీటర్లు పెట్టదంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల్లారా? తస్మాత్ జాగ్రత్త.. అని హెచ్చరించారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గడ్డమే గీయనని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారని, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ చెప్పాడని, మరి అవ న్నీ ఏమయ్యాయని హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని.. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను, అబద్ధపు బాండు పేపర్లను ఇక్కడి ప్రజలు నమ్మరని చెప్పారు. 30న ఓటు వేసేందుకు లైన్లలో నిలబడినప్పుడు ప్రజలు అన్నీ గుర్తుకు తెచ్చుకోవాలని, ఓటుతోనే కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 80 సీట్లలో బీఆర్ఎస్ గెలిచేది ఖాయమని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్, మాజీ ఎమ్మె ల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటకలో యువతను మోసగించినట్టే తెలంగాణలోనూ మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నది. రాహుల్గాంధీ చిక్కడపల్లిలో నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు. ఆయన మీటింగ్ పెట్టాల్సింది ఇక్కడ కాదు.. బెంగళూరులో పెట్టాలి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదో దమ్ముంటే అక్కడి నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలి.
-మంత్రి హరీశ్రావు
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే రైతులకు సాయాన్ని రద్దు చేసిందని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో సాయం కింద 4 వేలు ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని ఊడగొట్టారని చెప్పారు. తెలంగాణలో కూడా అదే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతుకు రైతుబంధు దక్కొద్దనేదే కాంగ్రెస్ పాలసీ అని పేర్కొన్నా రు. కర్ణాటకలో హామీలన్నీ ఏమయ్యాయని హైదరాబాద్లో మీడియా అడిగితే.. ఎన్నికలప్పుడు చాలా చెప్తామని, అన్నీ అమలు చేయడం సాధ్యమా? అని అక్కడి సీఎం సిద్ధరామయ్యనే ఒప్పుకొన్నారని గుర్తు చేశారు. ‘ఓడ దాటేదాక ఓడ మల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లయ్య’ అనేది కాంగ్రెస్ పార్టీ విధానమని సిద్ధరామయ్యనే ఒప్పుకొన్నారని తెలిపారు. కర్ణాటకలోలాగే తెలంగాణ ప్రజలను కూడా మోసగించాలని కాంగ్రెస్ చూస్తున్నదని చెప్పారు.
తెలంగాణలో బాయిలకాడ మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ చెప్పారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామనే అన్నారు. దేశంలో తెలంగాణ తప్ప అన్ని రాష్ర్టాల్లో బాయిలకాడ మీటర్లు పెట్టారని చెప్పారు. అందుకే తెలంగాణకు పైసలు ఆపిన అని అమ్మగారు ఉన్నమాట చెప్పారు. అప్పటిదాకా బీజేపీ వాళ్లు కూడా ఎగిరెగిరి పడ్డరు. మేమెక్కడ మోటర్లకు మీటర్లు పెట్టమన్నం. మేం అట్ల చెప్పినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తనని చెప్పిండో బీజేపీ నాయకుడు. రాజకీయ సన్యాసం తీసుకుంటనని చెప్పిండు ఇంకో బీజేపీ నాయకుడు. మరి.. ఇప్పుడు ఆ బీజేపీ వాళ్లంతా తలకాయలు ఎక్కడ పెట్టుకుంటరో.
-మంత్రి హరీశ్రావు
రేవంత్ అబద్ధాల కోరు అని, రైతుబంధుపై దగాకోరు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు మండిపడ్డారు. హరీశ్రావును తాను తప్పుబట్టానని రేవంత్పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధుకు అనుమతి ఇవ్వడంపై హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. భరత్కుమార్తో కలిసి తాను రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశానని, హరీశ్రావు మాట్లాడిన విషయాన్ని వివరించామని చెప్పారు. ఎన్నికల అధికారి సైతం తాము చెప్పిన దానితో ఏకీభవించారని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించేందుకు ప్రయత్నించామని, కానీ సెలవు కావడంతో అందుబాటులోకి రాలేదని తెలిపారు.