న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆన్లైన్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సేవలను పొందే సమయంలో అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉండాలని, అలాగే తమ వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేయగల నకిలీ లింక్లు, సందేశాలు లేదా ఈమెయిల్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) తన సభ్యులను కోరింది. క్లిక్ చేసే ముందు ఆలోచించండి! ఆన్లైన్లో అప్రమత్తంగా ఉండాలని ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ సూచిస్తున్నది. నకిలీ లింక్లకు దూరంగా ఉండండి. యూఆర్ఎల్లను సరిచూసుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎల్లప్పుడూ భద్రంగా ఉంచుకోండి అని ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. డిజిటల్ విధానాల వినియోగం పెరుగుతుండడం, వివిధ పీఎఫ్ సేవలను పొందడానికి సభ్యులు ఆన్లైన్ వేదికలను ఎక్కువగా ఉపయోగిస్తున్న తరుణంలో ఈపీఎఫ్వో ఈ హెచ్చరిక చేసింది.
అధికారిక ప్లాట్ఫారాలను పోలిన నకిలీ వెబ్సైట్లు, లింక్లను సృష్టించడం ద్వారా మోసగాళ్లు అమాయకులను మోసగించి, వారి నుండి సున్నితమైన సమాచారాన్ని పంచుకునేలా చేయడానికి అనేక ఉపాయాలను ప్రయోగిస్తారు. ఏదైనా లింక్పై క్లిక్ చేసే ముందు, లేదా వ్యక్తిగత లేదా ఖాతాకు సంబంధించిన వివరాలను సమోదు చేసే ముందు సభ్యులు వెబ్ చిరునామాను, ఇతర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తెలియని మెసేజ్లు, ఈమెయిల్స్ లేదా ధ్రువీకరించలేని ఇతర మార్గాల ద్వారా వచ్చే లింక్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అవి ఏటీఎం పిన్లు, ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారాన్ని లేదా వ్యక్తిగత వివరాలను అడిగినప్పుడు మరింత జాగ్రత్త వహించాలని ఈపీఎఫ్వో వర్గాలు సూచించాయి.