వరంగల్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అకాలమరణం ఆయన కుటుంబ సభ్యులను ఎంత కలవరపాటుకు గురిచేసిందో యావత్ గులాబీదళాన్ని అంతే కల్లోలానికి లోనుచేసింది. నల్లబెల్లిలో యూత్క్లబ్తో మొదలైన పెద్ది సుదర్శన్రెడ్డి ప్రస్థానం రెండున్నర దశాబ్దాలపాటు అప్రతిహతంగా కొనసాగి సోమవారంతో ముగిసింది. ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో పెద్ది తెలంగాణ అస్తిత్వ పోరులో గులాబీ రేకై గుభాళించారు. బీఆర్ఎస్ పార్టీ నీడలో అతి సామాన్య కార్యకర్త నుంచి మొదలై అంచెలంచెలుగా ఎదిగి పార్టీ అధినేత దాకా అందరి గుండెల్లో చెక్కుచెదరని సంతకమై నిలిచారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన నర్సంపేట నియోజకవర్గం నుంచి రాటుతేలిన నాయకుడిగా తన ను తాను మలచుకున్నారు. ఎమ్మెల్యేగా వ్యవహరించింది ఒక్కసారే అయినా నర్సంపేట నియోజకవర్గం అంతా తన ఇల్లుగా తీర్చిదిద్దుకున్నారని ఆయన అంతిమయాత్రతో తేలిపోయింది. గతనెల చివరివారంలో పెద్దికి తీవ్ర అస్వస్థత అని తెలిసినప్పటి నుంచి నర్సంపేట నియోజకవర్గమే కాదు ఉమ్మడి జిల్లా మీదుగా తెలంగాణ సరిహద్దుల దాకా కలవరపాటుకు గురిచేసింది. హనుమకొండ నుంచి హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేర్చేదాకా బీఆర్ఎస్ మొత్తం ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలని పరితపించింది. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీఆర్ఎస్ ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చినా పెద్ది ఆయువు అనంతవాయువుల్లో కలిసిపోయింది.

పెద్ది సుదర్శన్రెడ్డి అకాల మరణం ఆయన కుటుంబాన్ని, భార్యాపిల్లలకు తిరిగి తెచ్చివ్వలేకపోయినా సమస్త బీఆర్ఎస్ వారికి అనిర్వచనీయమైన నివాళి అర్పించింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి పెద్ది సాగించిన పోరాటం, స్వరాష్ట్ర సాధన అనంత రం ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ ప్రతినిధిగా పెద్ది పోషించిన పాత్ర, ఆయన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవ, కల్పించిన సౌకర్యాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేరీతిలో బీఆర్ఎస్ అజరామర నివాళిని అర్పించింది.

పార్టీ అధినేత కేసీఆర్ మొ దలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నీ తామై వ్యవహరించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చే సూచనలను జిల్లాలోని ఇతర నాయకగణానికి చేరవేసి సమన్వయం చేశారు.
మరోవైపు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్రెడ్డి, వాసుదేవరెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయటంలో తలమునకలయ్యారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత పెద్ది సతీమణి స్వప్నకు ఆస్పత్రి దగ్గరి నుంచి సంస్మరణ సభ రోజుదాకా చేదోడువాదోగా నిలిచారు. తమ కుటుంబ సభ్యుడి ఆపదలో తామంతా భాగం పంచుకుంటామని బీఆర్ఎస్ మరోసారి నిరూపించింది. మరోవైపు నర్సంపేట నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు విరామం ఎరుగక నల్లబెల్లికి బాటపట్టారు.
దివంగత పెద్ది సుదర్శన్రెడ్డితో తమకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకొని ఆయన నుంచి స్ఫూర్తి పొందారు. పెద్ది ఆశయాలను కొనసాగిస్తామని ప్రతినబూనారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఇద్దరూ అసామాన్యులు సోమవారం నాటి సంస్మరణ సభలో అతిసామాన్యుల వలె వ్యవహరించారు. అంతిమఘట్టంలో అనిర్వచనీయమైన ఉద్విగ్నతకు లోనయ్యారు. హరీశ్రావు అయితే పెద్దితో తనకున్న ఉద్యమానుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

కేటీఆర్ ఒకవైపు పెద్ది పోరాటపటిమను గుర్తుచేస్తూనే ఉద్యమ ప్రస్థానంలో పెద్ది పోషించిన పాత్ర నుంచి మొదలుపెట్టి అంతిమయాత్ర అనంతర పరిణామాలు, నర్సంపేట నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ఆయన అనుసరించిన మార్గం ఇతరులకు ఎట్లా ఆచరణీయమో కండ్లకు కడుతూ ఉద్విగ్నతకు లోనయ్యారు. ఇక నర్సంపేట నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరూ ఒక్కోజ్ఞాపకమై కన్నీటి సంద్రాన్ని పెనవేసుకున్నారు. మొత్తంగా ఒక రాజకీయ పార్టీ తన కుటుంబ సభ్యుడు అకాల మరణం పాలైతే ఆయన భార్యాపిల్లలకు, తల్లికి, ఇతర అన్నదమ్ములకు ఎలా అండగా నిలబడుతుంది? ఎంత వరకు వెళుతుంది? అంటే పెద్ది సుదర్శన్రెడ్డి ఉదంతం నేపథ్యంగా బీఆర్ఎస్ మరోసారి తెలియజెప్పినట్టు అయింది. కాగా, నర్సంపేట గడ్డ మీద పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని పెట్టడం కోసం మరో పోరుబాటనే చూపుతుండటం గమనార్హం.