సంగారెడ్డి/సదాశివపేట, నవంబర్ 23: తెలంగాణలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్, బీజేపీ తట్టుకోలేక లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాహుల్గాంధీ అక్కడ భారత్ జోడో యాత్ర చేయకుండా పక్క రాష్ర్టాల నుంచి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
గురువారం ఆయన సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో కలిసి కంది మండల కేంద్రం శివారులో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం, సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తొలుత సర్దార్ సర్వాయి పాపాన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గీత కార్మికులు మంత్రికి కల్లుగీసే మోకులు అందజేసి మెమోంటోను అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని తట్టుకోలేక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనార్టీల సంక్షేమానికి తొమిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల నిధులు ఖర్చు చేసిందని వివరించారు.
చెట్ల పన్నులు రద్దు చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈత, తాటి చెట్ల పన్నును రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని హరీశ్రావు చెప్పారు. గీత కార్మికులు మృతిచెందితే చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచామని తెలిపారు. త్వరలోనే గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు (మోపెడ్)లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైన్స్షాప్ల్లో గౌడ్లకు 15% రిజర్వేషన్ కల్పించామని, హైదరాబాద్ ట్యాంక్బండ్పై రూ.3 కోట్లతో సర్దార్ సర్వాయి పాపాన్న విగ్రహం ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్, నిమోజకవర్గ ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎన్నికల కో ఆర్డినేటర్ పట్నం మాణిక్యం, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట.. జన ప్రభంజనం
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో కలిసి నిర్వహించిన రోడ్షోకు ప్రజలు పోటెత్తారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గాంధీచౌక్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. టూరిస్ట్లా సంగారెడ్డికి అప్పుడడప్పుడు వచ్చిపోయే ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. రోడ్షోలో ఎంపీపీ యాదమ్మ, మున్సిపల్ వైస్చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్రావు దేశ్పాండే, చీల మల్లన్న, పిల్లిగుండ్ల వీరేశం తదితరులు పాల్గొన్నారు.