సిద్దిపేట: జిల్లాలోని నంగునూరు మండలంలో కొనసాగుతున్న కాలువలు, చెక్డ్యాం నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. నంగునూరు మండలంలోని ఖాతా గ్రామం ఎల్డీ-10లో సైఫాన్ కాలువ, చెక్డ్యాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ ఏస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ, డీఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజాలతో కలిసి నిర్మాణ పనులను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయక సాగర్ జలాశయం ఆర్ఏంసీ కుడి కాలువ ద్వారా వచ్చే నీరు, వాటి నీటి లభ్యతపై, ఎల్డీ-10 పనుల పురోగతిపై చర్చించారు.
పెద్దవాగుపై ఖాతా గ్రామం వద్ద దాదాపు రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో చెక్డ్యాం, దర్గపల్లి గ్రామంలో సిద్ధిపేట వాగుపై చెక్డ్యాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ పనులను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలన్నీ నిండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నంగునూరు మండలంలోని వాగు అవతలి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.