హైదరాబాద్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో చాలా వరకు అంటూ వ్యాధులు, సీజనల్ వ్యాధులు కూడా చాలా తగ్గాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఐదేండ్ల క్రితం వర్షాలు తగ్గిన తర్వాత డెంగ్యూ వ్యాధి విజృంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా వ్యాధి ప్రబలుతుందని తెలిపారు. మలేరియా, డెంగ్యూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం హెల్త్ టీమ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని హరీశ్రావు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు హరీశ్రావు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వనికి సహకరించాలని కోరుతున్నామన్నారు. ప్రజాప్రతిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్రావు స్పష్టం చేశారు. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీంకు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఇబ్రహీం ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, అతని నమూనాలను సేకరించి, పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్కు పంపామని తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.