ఖమ్మం : దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
ఉద్యమ పార్టీ నేడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది అని హరీశ్రావు తెలిపారు. నేడు తెలంగాణ ఆచరించింది.. రేపు దేశమంతా అనుసరిస్తోందన్నారు. మన మిషన్ భగీరథను కేంద్రం దేశమంతా విస్తరిస్తోందని తెలిపారు. మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో అమలు చేస్తుందని చెప్పారు. రైతుబంధును కేంద్రం పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తుందని గుర్తు చేశారు. గ్రామాలకు అవార్డులు ఇస్తే 10కి పది తెలంగాణకే వచ్చాయన్నారు.
మతతత్వ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. మతతత్వ పార్టీలకు ఎవరైనా ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని సాగనంపితేనే ప్రభుత్వ రంగ సంస్థలకు మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో 18 లక్షల పోస్టులు ఖాళీలుంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయడం లేదన్నారు. ఉద్యోగాలు ఇచ్చే భారత్ రాష్ట్ర సమితి కావాలా..? ఉద్యోగాలు తీసేసే బీజేపీ కావాలా? అని హరీశ్రావు ప్రశ్నించారు.