Minister Harish Rao | రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై శనివారం ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ నిర్వహించి తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలన్నారు. కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్, పలు జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. తొమ్మిది కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని కల్పించాలని అధికారులకు సూచించారు.
తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ గారి మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు లేకుండా చూడాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బృందం పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మంత్రి కోరారు. మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేసేందుకు ఈ నెల 28 న ఆయా తొమ్మిది జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో కొత్త మెడికల్ కాలేజీలు సందర్శించి, పనులు వేగిరం చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంఈ రమేశ్రెడ్డిని మంత్రి ఆదేశించారు.
వచ్చే జూలై ఆగస్టు నాటికి అకడమిక్ ఇయర్ ప్రారంభం అయితే కొత్తగా 9జిల్లాల్లో విద్య, వైద్యం ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు సాధిస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3690కి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 26కు చేరుతుండడం వైద్యం, విద్యను బలోపేతం చేయాలన్న సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం అన్నారు.
60 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, గడిచిన 8, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు రావడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదనీ, అయినప్పటికీ వెనుకాడకుండా సీఎం కేసీఆర్ ప్రజలకు వైద్యం, వైద్య విద్యను చేరువ చేసేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వివరించారు. సమీక్ష సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్, ఇతర ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.