సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇవాళ చేపలను వదిలాం. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటర్లు పెట్టి, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని నాటి రోజులను గుర్తు చేశారు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్ దయతో నిండుగా ఉందన్నారు.
దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం సీఎం కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఎవుసానికి గతంలో నీళ్లు లేక ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండటంతో కూలీలు దొరకడం లేదన్నారు.
ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేవి. ఇవాళ ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయ్యిందని పేర్కొన్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఇదంతా కనపడటం లేదని ఎద్దేవాచేశారు.
ఆ కనపడని కాంగ్రెస్, బీజేపీ నాయకులను పేట చెరువులో ముంచాలని మంత్రి విమర్శించారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు రూ.2,016 పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాభివృద్ధికై దశల వారీగా కృషి చేస్తామన్నారు.
అలాగే బద్దిపడగ నుంచి సిద్దిపేట వరకు రాజ్ గోపాల్ పేట మీదుగా నాలుగు లేన్ల రహదారి వేసి బటర్ ఫ్లై టైట్లు వేయిస్తానని మంత్రి తెలిపారు. దసరా పండగ తరువాత రెండు పడకల గదుల నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు.