Harish rao | వరంగల్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, పేదల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్మికుల కోసం బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని, పైగా కార్మికుల పని గంటలు పెంచుతూ చట్టాలు చేసిందని మండిపడ్డారు. అదానీ, అంబాలనీ మేలు కోసం బీజేపీ ఆలోచిస్తే, కార్మికులు, పేదల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిత్యం కష్టపడుతుంటారని చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్ కాలేజీ ఆడిటోరియం గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన ‘కార్మిక యుద్ధభేరి’ సభలో మంత్రి హరీశ్రావు ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ దుర్మార్గులు చివరకు దేశాన్ని కాపాడే సైనికులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో రూపాయి విలువతోపాటు సిపాయి విలువ కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు, కార్మికుల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, బీఆర్ఎస్ ప్రభుత్వమే వీరి సంక్షేమం కోసం పాటుపడుతున్నదని అన్నారు.
శ్రమ, శక్తి, కష్టం నమ్ముకొనే కార్మికులు గొప్పవాళ్లని మంత్రి హరీశ్రావు అన్నారు. కార్మికులకు కులం, మతం ఉండదని, కార్మికులు లేకుంటే ప్రపంచం ఆగిపోతుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకొంటున్నదని విమర్శించారు. ‘మోదీ సర్కారు కార్మికుల పని గంటలను పెంచుతూ చట్టాలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నది. రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటు పరం చేసి లక్షల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. అదానీ, అంబానీల ఆస్తులు పెంచేందుకే పని చేస్తున్నది. బడా వ్యాపారవేత్తలకే మేలు చేస్తున్నది. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగనామం పెట్టినవారికి అండగా నిలుస్తున్నది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీని అమ్మడం వల్ల వారంతా రోడ్డున పడతారు. బీజేపీ దుర్మార్గులు దేశాన్ని కాపాడే సైనికులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. బీజేపీ హయాంలో రూపాయి విలువ, సిపాయి విలువ తగ్గింది. అగ్నిపథ్ తెచ్చి నాలుగేండ్లకే సిపాయిలను ఇంటికి పంపిస్తున్నారు. తర్వాత వారికి ఇంకో ఉద్యోగం దొరకదు. బీజేపీ ప్రభుత్వం సైనికులను ఆగం చేసింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ తెగనమ్ముతుంటే, సీఎం కేసీఆర్ వాటిని బలోపేతం చేస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్ల తయారీతోపాటు యాదాద్రి పవర్ ప్లాంటు పనిని కూడా ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కే అప్పగించారని తెలిపారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించేందుకు రాష్ట్రంలో 1,001 గురుకులాలను ఏర్పాటు చేశారని, వీటిలో చదివిన కార్మికుల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అవుతున్నారని చెప్పారు. తెలంగాణలోనే ఇలాంటివి జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాడాలనే ఆరాటంతో ఆత్మహత్య చేసుకొన్న కాశీబుగ్గకు చెందిన ఆటోడ్రైవర్ రాజమౌళి కుటుంబానికి రాష్ట్ర సర్కారు 10 లక్షలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందని గుర్తుచేశారు. రాజమౌళి త్యాగం వెలకట్టలేనిదని శ్లాఘించారు.
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పేదల జీవితాలు బాగుపడ్డాయి. కార్మికులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగాలో ఇల్లు కట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నం. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ త్వరలోనే మొదలవుతుంది. కార్మికుల పిల్లల బాధ్యత మా ప్రభుత్వానిదే. రెసిడెన్సియల్ స్కూళ్లలో వారికి చదువుకొనే అవకాశం కల్పిస్తున్నాం. వారు ప్రయోజకులు కావాలనేది ప్రభుత్వ సంకల్పం. కార్మికులు తమ పిల్లలను బాగా చదివించాలి. కార్మికుల పిల్లలు కూడా కార్మికులే కావొద్దు. మీ పిల్లలను మా ప్రభుత్వ విద్యా సంస్థలకు పంపండి. వారిని డాక్టర్, లాయర్, ఇంజినీర్లను చేసి మీకు అప్పజెప్తాం. కార్మికులు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లు మానేయాలి. ఇంటి భోజనమే తినాలి. మీ కుటుంబ సభ్యులు ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు. మంచి అలవాట్లు చేసుకొని మంచి జీవితం గడపండి’ అని మంత్రి హరీశ్రావు కోరారు.
కార్మికులు గుర్తు చేసుకొనేలా కార్యక్రమాలను నిర్వహించడంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ మాసోత్సవం పేరుతో నెలపాటు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల రిజిష్ర్టేషన్లలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉన్నదని, ఇక్కడ 20 వేల రిజిష్ర్టేషన్లు జరిగాయని, సిద్దిపేటలో 10 వేలు అయ్యాయని చెప్పారు. హమాలీ, ఆటో కార్మికుల, అడ్డా కూలీలు అందరి ఇండ్లకు స్వయంగా వెళ్లే వినయభాస్కర్ వారి ఆత్మబంధువుగా మారారని కొనియాడారు.
కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి గౌరవం, కార్మికులకు ఆత్మైస్థెర్యం తెచ్చారని చెప్పారు. వరంగల్ పశ్చిమలోలాగే సిద్దిపేటలో ఆటో డ్రైవర్ల సొసైటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తన ఇంటిని కుదువ పెట్టి వచ్చిన రూ.50 లక్షలను ఈ సొసైటీ మూలధనం వాటాగా ఇచ్చానని హరీశ్రావు వెల్లడించారు. ఈ వాటా ధనం ఇప్పుడు కోటి రూపాయలకు చేరిందని, డైలీ ఫైనాన్స్తో ఇబ్బంది పడేవారికి ఇది ఉపయోగడుతున్నదని చెప్పారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సాధించిన కార్మికుల పిల్లలను మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సన్మానించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులు హక్కులు అడిగితే గుర్రాలతో తొక్కించారని, తెలంగాణ రాష్ట్రంలో కార్మికులను సీఎం కేసీఆర్ గండెల్లో పెట్టుకొని కాపాడుతున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘గత ప్రభుత్వాలు కార్మికులను, పేదలను చిన్నచూపు చూశాయి. వేతనాలు పెంచాలని అడిగిన ఆశ కార్యకర్తలను, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించారు. నిరహారదీక్షలు చేసినా ప్రభుత్వాలు కనికరించేవి కావు. పేదలు, కార్మికుల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరే. సఫాయన్న సలాం అన్నరు కేసీఆర్.
ఉద్యోగులకు, సఫాయి కార్మికులకు సమానంగా 30 శాతం చొప్పున వేతనాలు పెంచారు. హోంగార్డులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు ఇలా ప్రతి చిరుద్యోగి వేతనం పెంచారు. హోంగార్డులకు భద్రత పెంచారు. ట్రాఫిక్ పోలీసుల కష్టాలు చూసి వారికి అండగా నిలిచారు. కేసీఆర్ కార్మికుల పక్షపాతి. ఆటోలకు లైఫ్ టాక్స్ తొలగించారు. ఆటో వాళ్లకు వేధింపులు లేకుండా చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచారు. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబానికి రూ.6 లక్షల సాయం అందిస్తున్నారు. డ్రైవర్లు, క్లీనర్లకు కూడా బీమా వర్తిస్తున్నది. బీఆర్ఎస్పథకాలతో కార్మికులకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతున్నది. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ కార్మికుల కుటుంబాలకే ఎక్కువగా అందుతున్నాయి’ అని తెలిపారు.