Minister Harish Rao | సంగమేశ్వర ద్వారా నీళ్లిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వివిధ పథకాల కింద రూ.175కోట్ల ఆర్థిక సాయం, రూ.204 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహలక్ష్మి పథకంలో ప్రస్తుతం పేర్లు రాని వారిని అర్హులుగా గుర్తించి.. మరోసారి ఇచ్చేలా చూస్తామన్నారు. హజ్హౌస్ పని నడుస్తుందని, షాదీఖానా సైతం మంజూరు చేసుకున్నామన్నారు.
ఖబ్రస్థాన్ కోసం ఐదెకరాల భూమిని కేటాయించామని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో కర్ఫ్యూ, గడబిడ లేదన్నారు. గంగా జమున తేహజీబ్ లాగా ఉంటున్నామన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అంటూ ముస్లిం మైనార్టీలకు చేసింది ఏమీ లేదన్నారు. 50ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉందని.. ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ వాలే కాం కరోడ్ బాత్.. పకోడ్ అన్నట్లు ఉందంటూ సెటైర్లు వేశారు. జహీరాబాద్లో నాడు నీళ్ల కోసం గోస ఉందని, ఇప్పుడు ఆ కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ చేశారన్నారు.
అన్ని కులాల భవనాలు ఏర్పాటుకు స్థలాలు ఇచ్చామన్నారు. ప్రజలు ఏది కోరినా కాదనకుండా ఇస్తున్నామని.. జహీరాబాద్లో డెలివరీలు ఎక్కువగా సర్కారు దవాఖానలో జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు రెట్టింపయ్యాయని, ఎమ్మెల్యే కోరిక మేరకు రూ.12 కోట్ల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఇచ్చామన్నారు. డయాలసిస్ సెంటర్ పెట్టామని, పేదలకు వైద్యం చేరువ చేశామన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఉందని, కానీ అక్కడ రైతుబంధు, రైతుబీమా, షాదీ ముబారక్, 24 గంటల కరెంట్ వంటి పథకాలు లేవన్నారు.
అక్కడ రూ.600 పింఛను, ఇక్కడ రూ.2వేలు ఉందన్నారు. నడ్డా వచ్చి హంగ్ అన్నాడని.. ఇక్కడ వచ్చేది హ్యాట్రిక్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ అని.. గుండె గుండెలో కేసీఆర్ ఉన్నాడన్నారు. గుడిసె గుడిసెలో కేసీఆర్ ఉన్నాడని చెప్పారు. జహీరాబాద్ ఎమ్మెల్యేగా మాణిక్రావును గెలిపించి.. అభివృద్ధి కొనసాగాలే చూడాలని కోరుతున్నానన్నారు. మీ అభివృద్ధికి నేను బాధ్యత తీసుకుంటానని.. సంగమేశ్వర ద్వారా నీళ్లిచ్చి రుణం తీసుకుంటానని.. ప్రతి పొలానికి నీళ్లిస్తానన్నారు.