Minister Harish | విద్యుత్ రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్లో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎండాకాలం వచ్చిందంటే నాలుగు కరెంటు కరెంటు ఉండకపోయేదని, తెలంగాణ దేశానికే తలమానికంగా మారింది కాబట్టే దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లుల్లోంచి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ లేవదీశారన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు దించమంటే కాల్పులు జరిపించి ఆరుగురి మరణానికి కారణమయ్యాడన్నారు.
లోవోల్టేజీతో మోటార్లు కాలుతున్నయి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వమంటే కొనుక్కోమని టీడీపీ చెప్పిందని, కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఉత్త కరెంట్ ఇచ్చిందని.. కరెంటు రాక రైతాంగం నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం ఎమ్మెల్యేలు ఫైరవికారులు అయ్యారని, వైఎస్ హయాంలో సిద్దిపేట పవర్ హౌస్ దగ్గర రెండు రోజులు ధర్నా చేశానన్నారు. సిద్దిపేటకు వంద ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చిండ్రు.. హరీశ్రావుకు గన్ని ఇస్తారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతుండేనన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారన్నారు.
అసెంబ్లీలో కరెంట్ గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విసనకర్రలు లేవు.. విసరడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్నామని, బీజేపీ వాళ్లు మోటర్ల దగ్గర మీటర్లు పెట్టమన్నారన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయమని బీజేపీ నేతలు చెబుతున్నారని, విద్యుత్ ఉద్యోగుల్లారా.. కార్మికుల్లారా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కేసీఆరే మనకు శ్రీరామ రక్ష అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడ్డారని, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం రూ.39వేల కోట్లను ఖర్చు చేశారన్నారు.
సీఎం కేసీఆర్ ఆరునెలల్లో విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేశారని, ఇతర రాష్ట్రాల్లో 7 గంటలే కరెంట్ వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను విద్యుత్ ఉద్యోగులు సలామ్ చేస్తున్నానన్నారు. పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్కు పవర్ హాలిడే ఇచ్చిండ్రు అని, విరామం లేకుండా పని చేస్తున్న సీఎం కేసీఆర్ను విరామం లేకుండా గెలిపిస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో లాభం జరగని ఇల్లు లేదని, వందల సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ సర్కార్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో 20లక్షల ఉద్యోగాలు వచ్చాయని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అయ్యాడు కాబట్టే మెదక్ జిల్లా అయ్యిందని, ట్రాన్స్కో ఎస్సీ ఆఫీస్ అయ్యిందన్నారు.