హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారని మంత్రి హరీశ్రావు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువుగానీ, కర్ఫ్యూలుగానీ లేవని, కాబట్టి ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం నేతృత్వంలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీ మార్చామని చెప్పారు. నగరానికి గ్రీన్ సిటీ అంతర్జాతీయ అవార్డును కూడా సాధించామని గుర్తుచేశారు.
ప్రతిపక్షాలకు ఒక అజెండా లేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్ నేతలను అసభ్య పదజాలంలో దూషిస్తున్నారని, అది సభ్యత కాదని మంత్రి హితవుపలికారు. ప్రతిపక్ష నేతలకు ప్రజలు పోలింగ్ బూత్లలో బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని చరిత్ర ఉన్నదని విమర్శించారు.
రాష్ట్ర సంపద బాగా పెరిగిందని, అప్పులలో తెలంగాణ రాష్ట్రం కింద నుంచి ఐదో రాష్ట్రంగా ఉన్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర సంపదను ఇంకా పెంచుతామని, ప్రజలకు పంచుతామని మంత్రి చెప్పారు. హైదరాబాద్లో మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మంత్రి ఆరోపించారు. అక్కడ వాళ్లు చెప్పుకుంటున్న 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని, కేవలం 2 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని మంత్రి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని, ఇప్పుడు 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని మంత్రి హరీశ్రావు చెప్పారు. మన ఊరు-మన బడి పథకంలో రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలే మార్చేశామని మంత్రి తెలిపారు. వెయ్యికి పైగా గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.