Harish Rao | సంగారెడ్డి : మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే.. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఎస్ఐడీసీ తన్వీర్, నర్వోత్తంలతో పాటు అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు జహీరాబాద్ నియోజక వర్గానికి ఉందన్నారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలి. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మాణిక్ రావు విజయానికి కృషి చేయాలి. పార్టీ నిర్ణయం, సీఎం కేసీఆర్ గారి నిర్ణయంలో మార్పు ఉండదు. మూడోసారి కూడా మాణిక్ రావుని గతంలో లాగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు.
కేసీఆర్ హ్యాట్రిక్ విజయాల్లో జహీరాబాద్ కూడా భాగస్వామి అవ్వాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మనస్పర్థలు పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. ఈ క్రమంలో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అవకాశం తప్పకుండా వస్తుంది.
రానున్న రోజుల్లో, భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు తగిన అవకాశాలు వస్తాయన్నారు. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుతుంది, కలసికట్టుగా పనిచేద్దామన్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇచ్చి గౌరవించింది. ఇంకా ఇతర కార్యకర్తలకు పార్టీ అవకాశం ఇస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు.