హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. దేశంలోనే తొలిస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ పార్డ్లో 33 జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందులను ఆన్లైన్ చేస్తామన్నారు. 100శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను అదేశించారు. 12-14 లోపు చిన్నారులకు కొవిడ్ టీకా వేసేందుకు తల్లిదండ్రులును సైతం భాగస్వామ్యం చేయాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి నెలా ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పనిభారంగా భావించకుండా, బాధ్యతగా ప్రజాసేవ చేయాలన్నారు. ఆరోగ్య శాఖపై సీఎం సుముఖంగా ఉన్నారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలు లేకుండా భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. టీబీ, మలేరియాలో పురోగతి సాధించాలన్నారు. నార్మల్ డెలివరీలపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంపై గర్భిణులకు అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్టెరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.