Minister Harish rao | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు లేఖ రాశారు. డిఫెన్స్ రంగంలోని ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని, నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోయి మేకిన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు.
మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదని, దాదాపు రూ. 930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని, సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పనులు అప్పగించలేదని, దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘సిక్ ఇండస్ట్రీ’గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు రాజ్నాథ్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5వేల మంది ఉపాది దెబ్బతింటుందని.. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ‘ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య’ ప్రతినిధులు తన దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారని, ఈ నేపథ్యంలోనే ఆరు డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నానని, వీటిని పరిగణనలోకి తీసుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు.