హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజాబహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆర్) వసతి గృహ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు మంజూరు చేయడంతోపాటు, రోడ్డు ఎంట్రీ కోసం అవసరమైన ఒక ఎకరం స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. రాజేంద్రనగర్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన రాజాబహదూర్ వెంకటరామారెడ్డి వసతి గృహ భవన నిర్మాణ పనులకు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులతో కలిసి మంత్రి హరీశ్రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి పేరు మీద మరో నూతన వసతి గృహ భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని చెప్పారు.
ఆర్బీవీఆర్ పేరు మీద ఒక అద్భుతమైన విద్యాక్షేత్రం రావాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.300 కోట్ల విలువైన 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. సీఎం ఆకాంక్ష మేరకు ఇక్కడ ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వవిద్యాలయం వస్తే రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. 1918లోనే రాజాబహదూర్ వెంకటరామారెడ్డి మంచి ఆలోచనతో హాస్టల్ను ప్రారంభించారని, అప్పట్లో ఆయన ఆ హాస్టల్ ప్రారంభించి ఉండకపోతే ఇంతమంది విద్యావేత్తలు వచ్చేవారు కాదని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, జస్టిస్ జీవన్రెడ్డి, జస్టిస్ సుదర్శన్రెడ్డి వంటి ఎంతోమంది ప్రముఖులకు చదువుకునే అవకాశం కలిగించిన ఘనత ఆర్బీవీఆర్కే దక్కిందని అన్నారు. నాడు ఆయన ఎంతో ముందుచూపుతో బాలుర, బాలికల హాస్టళ్లు ప్రారంభించడం వల్ల అక్కడ ఉండి చదువుకున్న ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలను అధిరోహించారని గుర్తుచేశారు. రాజాబహదూర్రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ఇలాంటి మంచి పనులకు సీఎం ఎల్లప్పుడూ ముందుంటారని, ఆర్బీవీఆర్ వసతి గృహ నిర్మాణ పనులపై ఇప్పటికే పలుమార్లు అడిగారని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హాస్టల్ భవనాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా ప్రముఖ ఇంజినీర్ గణపతిరెడ్డిని కోరారు.
ఆర్బీవీఆర్ సొసైటీకి స్థలం కేటాయించాలనే ప్రతిపాదనను మొదటిసారిగా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తీసుకువచ్చారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గుర్తుచేశారు. అందుకోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఎంతోమంది రెడ్డి ముఖ్యమంత్రులు వచ్చారని, కానీ ఎవరూ ఆర్బీవీఆర్ సొసైటీ అభివృద్ధికి ఏమీ ఇవ్వలేదని, నేడు సీఎం కేసీఆర్ మాత్రమే పెద్ద ఎత్తున స్థలాలు, నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.
ఒక పోలీసు అధికారిగా పనిచేస్తూనే సమాజ సేవకు కృషి చేసిన మహనీయుడు ఆర్బీవీఆర్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి శ్లాఘించారు. 75 ఏండ్ల క్రితమే ఆయన బాలికల చదువుల గురించి ఆలోచించి ప్రత్యేకంగా బాలికలు, మహిళల కోసం హాస్టళ్లు ప్రారంభించారని, నేడు కొంతమంది బేటీ బచావో, బేటీ పడావో అంటూ నినాదాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆర్బీవీఆర్ ఆ నాడు హాస్టళ్లు, విద్యాసంస్థలు ప్రారంభించకపోతే తాను, తనలాంటి మహిళలు చదువుకునే వారం కాదని చెప్పారు. కార్యక్రమంలో ఆర్బీవీఆర్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.