Harish Rao | మెదక్ : పైరవీలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు గృహపత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడు అనే సామెత ఊరికినే రాలేదు. ఎంతో కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప ఇల్లు కట్టలేము. అలాంటిది ఒక రూపాయి ఖర్చు కాకుండా చెమట చుక్క చిందించకుండా మీకు అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని హరీశ్రావు స్పష్టం చేశారు.
పైరవీకారుల పని లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్ చేతనే ఇళ్ల మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరు లోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చింది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. బావుల వద్ద మీటర్లు పెట్టనందుకు రూ. 30 వేల కోట్లను కేంద్రం ఆపిందని హరీశ్రావు గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంట్ కష్టాలు ఉండేవని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు సాగు, తాగు నీరు, కరెంట్ కష్టాలు లేవు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీళ్లకు, కరెంట్కు కష్టాలు మొదలవుతాయన్నారు. రైతులను ప్రేమించే నాయకుడు కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు కష్టమొచ్చినా రైతులకు కష్టం లేకుండా చూసుకున్నాడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు.
మెదక్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాము. ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా మీ వద్దకే వైద్య సేవలు తెచ్చాం అని హరీశ్రావు తెలిపారు. ఈనెల 14 తేదీన న్యూట్రిషన్ కిట్ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. గర్భిణీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని హరీశ్రావు స్పష్టం చేశారు.