సంగారెడ్డి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): సాగునీరు లేక అల్లాడిన సంగారెడ్డి జిల్లా రైతుల కలనెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గోదావరి జలాలతో సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభం అవుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి జలాలను ఎత్తిపోసి పంటపొలాలకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరి 21న సీఎం కేసీఆర్ స్వయంగా నారాయణఖేడ్ పట్టణంలో ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.
సీఎం కేసీఆర్ హామీ మేరకు భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. నారాయణఖేడ్, అందోల్ నియోజక వర్గాలకు సాగునీరు అందజేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా మనూరు మండలం బోరంచ గ్రామంలో నిర్మించనున్న పంప్హౌస్ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శనివారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 34.14 ఎకరాల భూమిని సేకరించింది. 13 ఎకరాల విస్తీర్ణంలో పంప్హౌస్, మిగతా 21.14 ఎకరాల్లో విద్యుత్తు సబ్స్టేషన్, ఇతర నిర్మాణాలను చేపట్టనున్నారు.
1.65 లక్షల ఎకరాలకు నీరు
రూ.1,774 కోట్ల వ్యయంతో ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది. నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మరోవైపు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూ.2,653 కోట్ల వ్యయంతో చేపట్టనున్నది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.