మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టుబట్టి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జిల్లాకు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి మెడికల్ కాలేజీ కూడా పాలమూరు జిల్లాకే వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలో పారామెడికల్ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుకుందామని తెలిపారు. పాలమూరుపై ప్రతిపక్షాల నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని హరీశ్రావు ధ్వజమెత్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో వైద్యారోగ్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ భూమిపూజ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తదితరులు పాల్గొన్నారు.