Minister Harish Rao | ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తన బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎన్సాన్పల్లి గ్రామంలో జిల్లా కారాగార భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు, విద్య, హాస్పిటల్ తదితర అన్నింటిలాగా జైలు సైతం అవసరమన్నారు. రూ.78కోట్లతో 34 ఎకరాల సువిశాల స్థలంలో జిల్లా జైలు నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలోనే కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మొదటి జిల్లా కారాగారం ఇదేనన్నారు. జైల్లలో సౌకర్యాలు కల్పించి, అవసరమైన ఉపాధి శిక్షణ, కౌన్సెలింగ్, అక్షరాస్యత నేర్పి, ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చి దేశంలోనే రాష్ట్ర జైళ్ల శాఖ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఏడు, ఎనిమిది సంవత్సరాల కృషి ఫలితంగా సిద్దిపేటకు జిల్లా జైలు వచ్చిందని, ఈ జిల్లా జైలులో 425 మంది ఖైదులు సౌకర్యవంతంగా ఉండవచ్చన్నారు. ఇక్కడ ఓపెన్ జైలు కూడా ఏర్పాటు చేస్తామని, ధ్యానం, యోగ, నైపుణ్య శిక్షణ, కౌన్సెలింగ్ ఇచ్చేందుకే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏడాదిలో జిల్లా జైలు నిర్మాణం పూర్తి చేసి ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం పక్కన ఉన్న సబ్ జైలు తరలించనున్నట్లు తెలిపారు. సబ్ జైలు ప్రాంతాన్ని సిద్దిపేట మున్సిపాలిటీ, రెవెన్యూ కార్యాలయానికి వాడుకుంటామన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మాదిరిగా ఎన్సాన్పల్లి కూడా దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.
మెడికల్ కళాశాల, ఆసుపత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, సెంట్రల్ బట్టర్ఫ్లై లైటింగ్, సమీపంలోనే కోమటి చెరువు, శిల్పారామం అన్నీ ఉన్నాయన్నారు. జైళ్లశాఖ డీజీ జితేందర్ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీస్, లా అండ్ ఆర్డర్, జైళ్ల శాఖకు మంచి పేరు ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన నాటినుండి ఇప్పటివరకు 400 మంది సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేశామన్నారు. జైల్లో క్రమశిక్షణ నేర్పడం, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో జైళ్లకు రిపీటెడ్గా వచ్చే ఖైదీల శాతం 8 నుంచి 2శాతానికి తగ్గిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ప్రిజనర్స్ డీజీ జితేందర్, ప్రిజనర్స్ ఐజీ రాజేశ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, ప్రిజనర్స్ డీఐజీ మురళీ బాబు, కమిషనర్ శ్వేతా, చీఫ్ ఇంజినీర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.