హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తొమ్మిదేండ్లలో కర్ఫ్యూలు లేవని, అల్లర్లు లేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని వెల్లడించారు. తాము ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో అసెంబ్లీ మొదలు కాగానే నీళ్ల కోసం ఖాళీ కుండల ప్రదర్శన, కరెంటు కోసం కందెనల ప్రదర్శనతో మొదలయ్యేదని గుర్తు చేశారు. ఇప్పటికీ అనేక రాష్ర్టాల్లో ఇవి కనిపిస్తున్నాయని, తెలంగాణలో అలాంటివి కనిపించాయా? అని ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్లో ఎరువులు దొరకక తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది రైతులు చనిపోయారని, డబుల్ ఇంజిన్ సర్కార్ దుస్థితి ఇదని మండిపడ్డారు. ‘తెలంగాణలో ఎరువుల కొరత ఉన్నదా? కరంటు కొరత ఉన్నదా?’ అని అడిగారు. తమకు బియ్యం కావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు తెలంగాణను అడుగుతున్నాయని తెలిపారు. ‘మనకంటే భౌగోళికంగా, జనాభాపరంగా పెద్ద రాష్ర్టాలు బియ్యం అమ్మండి మహాప్రభో అని తెలంగాణను అడిగే స్థితికి తీసుకెళ్లింది సీఎం కేసీఆర్ పాలన కాదా? మనం తినడమే కాదు పొరుగు రాష్ర్టాలకు తిండిపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదా?’ అని అన్నారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో అదానీ బాగుపడ్డారే తప్ప.. ఏ రంగంలో అయినా గుణాత్మక మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు.
విమర్శలు మాకు కొత్త కాదు
మొన్నటిదాకా బీఆర్ఎస్కు బలమే లేదు అన్నవాళ్లు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన తర్వాత ఉలిక్కిపడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. దేశంలోని నీళ్లను సవ్యంగా వాడితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చని, 200 ఏండ్లకు సరిపడా ఉన్న బొగ్గు నిల్వలతో 24 గంటల కరంటు ఇవ్వొచ్చని.. ఇలా అంశాల వారీగా సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే తమపై బురద జల్లుతున్నారని చెప్పారు. ఇలాంటివి కొత్త కాదన్నారు. గతంలో టీఆర్ఎస్ మొదలైనప్పుడు పాలపొంగు అని, నీటి బుడగ అని, తెలుగుదేశం ఏజెంట్ అని, కాంగ్రెస్ ఏజెంట్ అని రకరకాలుగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏజెంట్లమని చెప్పి కొట్లాడామని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామహంతి, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.