సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న విశ్వకర్మ సంఘ భవన నిర్మాణం, వీర భద్రీయ కుల సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుత..గతంలో కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే రైలు..రాబోయే రోజుల్లో గజ్వేల్ నుంచి తిరుపతికి నడిపేలా ప్రభుత్వం యోచిస్తుందన్నారు. గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేలుగా పని చేసిన సంజీవరావు, విజయ రామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డిల హయాంలో ఒకప్పుడు గుక్కెడు మంచినీటి కోసం గోసపడ్డ గజ్వేల్ ఇవాళ సీఎం కేసీఆర్ హయాంలో దశ, దిశ మారిందన్నారు.
8 బస్ బేలతో అధునాతన సౌకర్యాలతో ఎక్స్ ప్రెస్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణం ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గజ్వేల్ పట్టణంలో రూ.2 కోట్ల రూపాయలతో బస్ బే నిర్మాణం చేయనున్నాం. అలాగే ప్రజ్ఞాపూర్ లో రూ.4 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మించనున్నాం.
ఎడ్యుకేషన్ హబ్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, పాండవుల చెరువు, మహతి ఆడిటోరియం ఇలా ఎన్నింటినో నిర్మించి ఆదర్శ ప్రాయంగా నిలిచామన్నారు. అనంతరం గజ్వేల్ కుమ్మరి సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.