హైదరాబాద్: ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను ఏఎన్ఎంలు ఇంటికే తెచ్చి ఇస్తారని చెప్పారు. కంటివెలుగు రెండో విడుత ప్రారంభోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన పథకాలను ప్రశంసించారన్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని వివేకానందా కమ్యూనిటీహాల్లో కంటివెలుగు శిబిరాన్ని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని చెప్పారు. మన పథకాలను అనేక రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తున్నాయని చెప్పారు. కంటివెలుగును పంజాబ్, ఢిల్లీలో అమలు చేస్తామనడం తెలంగాణకు గర్వకారణమని వెల్లడించారు.
నేటినుంచి రెండో విడుత కంటివెలుగు ప్రారంభమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్లో 8 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. అవసరమైనవారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తామన్నారు. జీహెచ్ఎంసీ, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లకు టీమ్లను పంపిస్తామన్నారు. ప్రెస్క్లబ్లో కూడా కంటివెలుగు కార్యక్రమం చేపడుతామని తెలిపారు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
కంటిచూపు కోసం ఇంతటి భారీ కార్యక్రమం ఎవరూ చేపట్టలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ మహత్తర కార్యక్రమం ప్రారంభించారన్నారు.