సిద్దిపేట: రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు రెండు పడకల ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని పాలమాకులలో కొత్తగా నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే సొంతజాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్మెంటుకు కూడా సరిపోయేవి కాదని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి తాళం చేతిలో పెట్టి లబ్ధిదారులకు అప్పగిస్తున్నామన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఉందా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దంటున్న కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలు ఆదాయం పెంచుతున్నారని, బీజేపీ మాత్రం ప్రజల సొమ్మును ధనవంతులకు పంచుతున్నదని దుయ్యబట్టారు.
త్వరలో అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని, సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ.. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని వివరించారు. కానీ ఢిల్లీ బీజేపీ ఉచితాలు వద్దని, కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతుభీమా, ఆసరా పెన్షన్ వద్దని స్వయంగా దేశ ప్రధాని చెప్తుంటే ప్రజలేమవాలనీ నిలదీశారు.
రైతులకు 24 గంటల ఉచిత రావాల్సిన కరెంటును కేంద్రం కట్ చేసిందని విమర్శించారు. బాయికాడ మీటర్లు పెడితే ఈ ఆర్థిక సంవత్సంరం రూ.65 వేల కోట్లు ఇస్తామని ఆశ చూపిందన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ బావుల మీటర్లకు ఒప్పుకోలేదని చెప్పారు. తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు రైతులకు అందిస్తుంటే బీజేపీ నేతలకు కళ్లు మండి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం బాగుపడ్డదో, ఎవరికి లాభం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పారు.