హైదరాబాద్: తల్లి బిడ్డా సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది.
వీటిని మంత్రి హరీశ్ రావు శనివారం మధ్యహ్నం హైదరాబాద్లోని పెట్ల బురుజు దవాఖాన వేదికగా ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలుగనుంది. ప్రైవేటులో రూ.2 నుంచి 3 వేలు ఖర్చయ్యే ఈ స్కానింగ్ ఇకపై ఉచితంగా సర్కారు దవాఖానల్లో చేయనున్నారు.
ఈ స్కానింగ్ మిషన్ల ద్వారా తల్లిగర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే సులువుగా గుర్తించవచ్చని వైదుల్లు తెలిపారు. దీంతో దానికి అనుగుణంగా వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పారు. టిఫా స్కాన్ను 18 నుంచి 22 వారాల మధ్యలో చేస్తారు.