సిద్దిపేట : సద్దితిన్న రేవును తలిస్తే.. దేవుడు సల్లగ చూస్తాడు. అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తునికి-ఖల్సాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాలు చేయించే కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..బతుకమ్మ పండుగ రోజున డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో బేస్మెంట్కే డబ్బులు సరిపోయేవి కావు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు కట్టి, కడప పెట్టి, ఇండ్ల తాళం చెవిలు మీ చేతిలో పెట్టి కొత్తింట్లోకి తోలుతున్నామని మంత్రి గుర్తు చేశారు.
గతంలో ఎమ్మెల్యేలుగా విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి ఎవరొచ్చినా.. మీ గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారలేదు. సీఎం కేసీఆర్ వచ్చాక గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారిందన్నారు. బీజేపీ నేతలకు మాటలెక్కువ..చేతలు తక్కువ.
దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బీజేపీ పై మంత్రి మండిపడ్డారు. 70 ఏండ్లలో కాని పనిని, సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పాల్గొన్నారు.