ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్లో హెల్త్ ప్రొఫైల్ పెలెట్ ప్రాజెక్టును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. అంతకుముందు జిల్లా దవాఖాన భవనం, రేడియాలజీ ల్యాబ్, పీడియాట్రిక్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్ ఇస్తారు. వారి నుంచి నమూనాలను సేకరించి, 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తారు.
ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. దీర్ఘకాలిక బాధితులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం అదించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.
హెల్త్ ప్రొఫైల్ సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 ఏండ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచికలను సేకరిస్తారు. ములుగు జిల్లాలో దాదాపు 2 లక్షల 18 వేల 852 మంది 18 ఏండ్లు పైబడిన వారు ఉన్నారు. వారి నుంచి..
– జ్వరం, రక్త పోటు, రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, వయసు తగ్గ ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, శరీర కొలతలు, రక్తంలో ప్రాణవాయువు, గుండె కొట్టుకునే తీరు, ఇతర అంశాలు, అనారోగ్య సమస్యలు నమోదుచేసుకుంటారు.
– రక్తం, మూత్ర నమూనాలను సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో పరిశీలిస్తారు.
– ప్రతి వ్యక్తి ఆధార్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వివరాలు సేకరించిన వారికి ఏకీకృత నంబర్ను కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే వీలుంటుంది.
– కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), సంపూర్ణ మూత్ర పరీక్ష, మూత్రపిండాల పనితీరు తెలుసుకునేందుకు ఆల్బుమిన్, బ్లడ్ యూరియా, క్రియాటిన్ మొదలైన పరీక్షలు చేస్తారు
– రక్తంలో చక్కర స్థాయి తెలుసుకొనేందుకు మూడు నెలల సగటు (హెచ్డీఏ 1సీ) పరీక్షలు
– గుండె పనితీరును తెలుసుకునేందుకు కొలెస్ట్రాల్, కంప్లీట్ హెచ్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఈసీజీ
– కాలేయ సంబంధిత పనితీరును తెలుసుకునేందుకు వివిధ కాలేయ పరీక్షలు చేస్తారు
ఈ పథకంలో భాగంగా వైద్య పరీక్షల ఆధారంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే చికిత్స అందిస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి భవిష్యత్తులో ఏ విధమైన జబ్బులు రాకుండా తగిన సూచనలు చేస్తారు.