రంగారెడ్డి: ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, సికింద్రాబాద్లోని వెస్ట్మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ (Minister KTR) ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కలిసి టిఫిన్ చేసిన మంత్రి.. రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
ఇక రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రతిరోజు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేస్తారు.
అల్పాహార మెనూ
సోమవారం: ఇడ్లీ సాంబార్/ గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం: పూరి, ఆలు కుర్మా/ టమాటా బాత్, చట్నీ
బుధవారం: ఉప్మా,సాంబార్/ కిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ / పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ/ కిచిడీ, చట్నీ
శనివారం: పొంగల్, సాంబార్/వెజ్ పలావ్, రైతా/ఆలు కుర్మా