కాంగ్రెస్ అందంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు రూ.15 వేలు అని రాసింది. కేసీఆర్ మాత్రం ప్రతి ఎకరానికి రూ.16 వేలు ఇస్తామంటున్నారు. మీకు మూడెకరాలు ఉన్నా కాంగ్రెస్ వాళ్లు రూ.15 వేలే ఇస్తరు. అదే మూడెకరాలు ఉంటే కేసీఆర్ రూ.48 వేలు ఇస్తరు. కాంగ్రెస్ మర్మాన్ని ప్రజలు గుర్తించాలి. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఏటా అని మాత్రమే ఉన్నది. ప్రతి ఎకరాకు అని ఎక్కడా లేదు. తస్మాత్ జాగ్రత్త.
– మంత్రి హరీశ్రావు
సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కరీంనగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సర్కారుకు, సీఎం కేసీఆర్కు రైతులే ముఖ్యమని, అందుకే రైతుల బాయికాడ మీటర్లు పెట్టలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలంటే, పెట్టనందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రూ.25,000 కోట్లు ఆపేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేసిన హరీశ్.. ఇప్పటిదాకా మనం ఏం చెప్పామో, అదే ఈ రోజు ఆమె ఉన్నది ఉన్నట్టు బయట పెట్టారని అన్నారు.
‘తెలంగాణవాళ్లు బాయిలకాడ మీటర్లు పెట్టలేదు. దేశం అంతా, పక్క రాష్ర్టాల వాళ్లు మీటర్లు పెట్టినారు. వాళ్లకు డబ్బులు ఇచ్చినం. తెలంగాణవాళ్లు మీటర్లు పెట్టలేదు. కాబట్టి డబ్బులు ఇవ్వలేదు’ అని కేంద్ర మంత్రి కుండబద్దలు కొట్టారని స్పష్టం చేశారు. మోటర్లకు మీటర్లు అని బీజేపీవాళ్లు, మూడు గంటల కరెంట్ అని కాంగ్రెస్వాళ్లు అంటున్నారని, సీఎం కేసీఆర్ మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని వివరించారు. దీన్ని బట్టే ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ, చిగురుమామిడి, అక్కన్నపేట, హుస్నాబాద్ మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీశ్కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన మాయమాటలు నమ్మి తాము మోసపోయామని, మీరు మోసపోవద్దని కర్ణాటక ప్రజలు తెలంగాణకు వచ్చి చెప్తున్నారని గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు గల్లీగల్లీ తిరిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు జాడ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.
ఇటు ఆ పార్టీ నాయకుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలని అంటున్నారని, 3 గంటల కరెంట్తో 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొని పారించుకోవాలని చెప్తున్నారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. విరామం లేకుండా కరెంట్ ఇచ్చే కేసీఆర్ను విరామం లేకుండా గెలిపించుకుందామని అన్నారు. ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్న వారిమీదికి కాల్చిపారేస్తానని రేవంత్రెడ్డి తుపాకి పట్టుకొని కరీంనగర్ మీటింగ్కు రాలేదా? పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మనమైతే తుపాకి చేతిలో పట్టుకొని తిరిగిన తుపాకి రాముడు రేవంత్రెడ్డి అని అన్నారు.
కాంగ్రెస్లో ఆర్నెల్లకో సీఎం
కాంగ్రెస్ వాళ్లది సుతి లేని సంసారమని, ఆ పార్టీలో మూడు గ్రూపులు ఉంటాయని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఇదే కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబుది ఒక గ్రూపు, పొన్నం ప్రభాకర్ది ఒక గ్రూపు, జీవన్రెడ్డిది ఒక గ్రూపు ఉంటదని, వీళ్లు ఒకల మాటలు ఒకలు వినరని విమర్శించారు. ఆరు గ్యారెంటీల మాట దేవుడెరుగు, ఆరె నెలలకో సీఎం మాత్రం గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ కోసం ఈసీకి లేఖ రాశామని, అనుమతి రాగానే వారంలో పూర్తి చేస్తామని తెలిపారు. అనుమతి రాకపోయినా, డిసెంబర్ 3 తర్వాత వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే మిత్తితో సహా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో హుస్నాబాద్ అభివృద్ధి
కేసీఆర్ సీఎం అయ్యాక ఎమ్మెల్యే సతీశ్ నేతృత్వంలో హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని హరీశ్రావు అన్నారు. కోర్టుల్లో కేసులు వేసి గౌరవెల్లి ప్రాజెక్టు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే, మనం పూర్తిచేసుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సతీశ్ కుమార్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనను ఎవరు కూడా విమర్శించరని, ఎవరైనా ఆయన ఇంటికి వెళ్లితే అన్నం తినివచ్చారా? అని అడుగుతారని అన్నారు. కడుపు నిండా అన్నం పెట్టే ఇల్లు వాళ్లదని చెప్పారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీపీ కొత్త వినీలాశ్రీనివాస్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.