Harish Rao | చార్మినార్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వ తీసుకొంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకొన్నామని చెప్పారు. సోమవారం పెట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో వైద్య సిబ్బందికి నిర్వహించిన ఇన్ఫెక్షన్ నివారణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణులకు చికిత్స అందించే సమయంలోనే మాతాశిశు సంరక్షణపై అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. దవాఖానల్లో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా తీసుకొనే నివారణ చర్యలను ఇంటికి వెళ్లాక కూడా పాటించేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేలా కృషి చేయాలని తెలిపారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, త్వరగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, దానితో వ్యాధి తీవ్రస్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు.
‘తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాలు, పట్టణాల్లోని ఏఎన్ఎం, ఆశా సిబ్బంది సేవలను సమర్థంగా వినియోగించుకొంటూ వైద్యారోగ్యాన్ని మరింత పటిష్ఠ పరుస్తున్నాం. ఈ విధానం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది’ అని తెలిపారు. మెటర్నిటీ దవాఖానల్లో లేబర్ వార్డులను ఆధునీకరించి, 50 దవాఖానల్లో టిఫా స్కాన్ మిషన్లను ఏర్పాటు చేశామని వివరించారు.
మాతాశిశు కేంద్రాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తూ, చిన్నారులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను మల్టీ స్పెషాలిటీ వైద్యుల పర్యవేక్షణలో సాగేలా చర్యలు తీసుకొన్నామని పేర్కొన్నారు. నిమ్స్ దవాఖానలో 250, గాంధీలో 200 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. త్వరలో న్యూట్రిషన్ కిట్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు వివరించారు.
శిశు మరణాలపై లోతైన విశ్లేషణ
ప్రాథమిక స్థాయిలోనే గర్భిణుల సమస్యలను గుర్తిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని హరీశ్రావు తెలిపారు. మాతాశిశు మరణాలపై లోతైన విశ్లేషణ చేపట్టి, నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. రాష్ట్రంలో 4 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 82 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. మెరుగైన పనితీరును కనబరుస్తున్న సిబ్బందిని ప్రమోషన్లు, అవార్డులతో ప్రోత్సహించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.
రాష్ట్ర గణాంకాల్లో మెరుగుదల
దేశవ్యాప్తంగా చూస్తే వైద్య చికిత్సల్లో రాష్ట్ర గణాంకాలు వృద్ధి చెందాయని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఎంఎంఆర్ విషయంలో రాష్ట్రం 2014లో లక్ష డెలివరీలకు 92, ఉండగా గతేడాది 43 తగ్గించామని తెలిపారు. ఐఎంఆర్ విషయంలో వెయ్యికి 2014లో 39 ఉండగా, 2022లో 21కి తగ్గించామని, దేశ సగటు 28 ఉన్నదని వివరించారు. నియోనాటల్ విషయంలో వెయ్యికి 2014లో 25 ఉంటే 2022లో 15కి తగ్గిందని, దేశ సగటు మాత్రం 20గా ఉన్నదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు లేక మరణాలు సంభవిస్తున్న ఉదంతాలు తీవ్రంగా కలిచివేశాయని, అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్రెడ్డి, పెట్లబుర్జు ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్ మాలతి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.