సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఆత్మగౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అంగన్వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ పాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం అంగన్వాడీలకు అరకొర వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. అంగన్వాడీల సేవలను, వారి పనితీరును గుర్తించి వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అని హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో మరో 104 మంది నూతన అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హరీశ్రావు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. అంగన్ వాడీలకు దేశంలోనే అత్యధిక వేతనం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్లో అంగన్వాడీ టీచర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని, కానీ మన తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ.7,800, అంగన్ వాడీ హెల్పర్లకు రూ.7,800 చొప్పున అత్యధిక వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇలా దేశంలో మరేదైనా రాష్ట్రంలో ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉండగా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుని, కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పుకుంటుందని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా, అంగన్ వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం వాటా ఇవ్వాల్సి ఉండగా, అంగన్ వాడీలకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్రం వాటా 80 శాతం, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యానికి, అంగన్ వాడీల పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు ఇదొక నిదర్శనమని మంత్రి వెల్లడించారు.
అంగన్ వాడీలు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ఏడాది అక్టోబరు నెలలో 30 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ ఏడాది జూలై నెల నుంచి అమలు చేస్తామని ప్రకటించి, పెంచిన వేతనాలు డిసెంబర్ నెల నుంచి అంగన్ వాడీ ఉద్యోగుల ఖాతాలలో పడుతున్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీనితో 67 వేల 411 మంది అంగన్ వాడీ ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. దు.
ఢిల్లీ, కేరళలో రూ. 10 వేలు ఇస్తుంటే, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రూ. 7 వేలు మాత్రమే ఇస్తున్నారు. హెల్పర్ల జీతాలు రూ.5 వేలు లేదా రూ.6 వేలకు మించడం లేదు. బీజేపీ పాలిత గుజరాత్లో రూ. 7,800 ఉండగా, ఉత్తరప్రదేశ్లో రూ. 8 వేలు ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనంతో పనిలేకుండా మన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారు. అరకొర సౌకర్యాలు, అగౌరవంగా నడిచే అంగన్వాడీలను పక్కా భవనాలు, స్కూల్స్ లోకి మార్చి మరింత గౌరవం పెంచాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని హరీశ్రావు తెలిపారు.