అక్కా చెల్లెల్లకు నీళ్లిచ్చుడు ఫెయిలా? పాసా? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెండ్లికి రూ.లక్ష ఇవ్వడం ఫెయిలా?పాసా?
ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా ప్రతి ఎకరానికి ఏడాదికి రెండుసార్లు రూ.10 వేల చొప్పున రైతుబంధు సాయం అందించడం ఫెయిలా? పాసా?
రూ.200 ఉన్న పింఛన్ను రూ.2 వేలు చేయడం ఫెయిలా? పాసా?
ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్ అందించడంతోపాటు తల్లీబిడ్డను ఇంటికాడ వాహనంలో విడిచిపెట్టడం ఫెయిలా? పాసా?
ఉమ్మడి రాష్ట్రంలో పొద్దున్న 3 గంటలు.. రాత్రి 6 గంటల కరెంట్.. అందులో గంటగంటకూ ట్రిప్ అవుతుంటే.. కాలిపోయే బోరు మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. కండ్లల్లో వత్తులు వేసుకొని చూసే కరెంట్ నాడుంటే.. నేడు నిరంతరం ఉచిత కరెంట్ ఇవ్వడం ఫెయిలా? పాసా?
నిన్న కాంగ్రెసోళ్లు మాట్లాడుతూ మీరు ఇండ్లోచ్చినోళ్లనే ఓట్లు అడగాలే అన్నారు.బరాబర్ ఇండ్లిచ్చినోళ్లను అడుగుతాం.
రైతుబంధు ఇచ్చినోళ్లను అడుగుతాం.
కల్యాణలక్ష్మి ఇచ్చినోళ్లను అడుగుతాం.
కేసీఆర్ కిట్ ఇచ్చినోళ్లను అడుగుతాం.
ఇంటింటికీ నల్లా నీళ్లను తాగుతున్న అక్కాచెల్లెళ్లలను అడుగుతాం.
కాళేశ్వరం జలాలు, ప్రాజెక్టుల కింద, చెరువుల కింద, చెక్డ్యాంల కింద నీళ్లు అందుకుంటున్న రైతన్నను ఓట్లు అడుగుతాం. వీళ్లందరూ ఓటేయగా.. ఇంకేవరన్నా మిగులుతారా? కాంగ్రెసోళ్లకు రైతుబంధు పైసలు పడ్తున్నయ్, కాంగ్రెసోళ్ల పిల్లలకు కల్యాణలక్ష్మి చెక్ వస్తున్నది. కేసీఆర్పై ఉన్న ప్రేమ మోదీపై ఉంటుందా? కేసీఆర్పై ఉన్న ప్రేమ రాహుల్గాంధీపై ఉంటుందా?
– మంత్రి హరీశ్రావు
మహబూబ్నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకన్నా ప్రమాదకరంగా తయారయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెడగొట్టు వానలు పడితే పంట ఖరాబ్ ఎట్ల అయితదో.. ఈ కాంగ్రెస్, బీజేపీ మాట్లాడే మాటలతో రాష్ట్రం ప్రతిష్ట అలా దెబ్బతింటున్నదని మండిపడ్డారు. శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రూ.30 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖానను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఓవైపు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని, తెలంగాణను అనుసరిస్తున్నదని.. ఆచరిస్తున్నదని, అంత గొప్పగా సీఎం కేసీఆర్ పాలన ఉన్నదని చెప్పారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, కల్యాణలక్ష్మి, జిల్లాకో మెడికల్ కాలేజీ, రెసిడెన్షియల్ స్కూళ్లు, కంటి వెలుగు.. ఇలా మన పథకాలను దేశం మొత్తం కాపీ కొట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తెలంగాణ ప్రగతిని చూడలేని కళ్లున్న కబోదుల్లా మారాయని ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చింది.. అభివృద్ధి చేసింది.. సీఎం కేసీఆరే అని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో నిజాయితీగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. ‘ప్రతిపక్ష నాయకులు ఏనాడైనా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడిండ్రా? తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడిండ్రా? మాటలు మాట్లాడకుండా కేసులు పెట్టిన్రు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషివల్లే జడ్చర్లలో వంద పడకల దవాఖాన ప్రారంభమైందని తెలిపారు. లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దవాఖాన ఊరికి దూరంగా ఉండొద్దని తన సొంత స్థలాన్ని ఇచ్చి దవాఖాన నిర్మాణానికి కృషిచేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్నగర్కు ఎందుకు మెడికల్ కాలేజీ రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 20 ఏండ్లకు ఒక మెడికల్ కాలేజీ వస్తే..కేవలం నిరుడు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, ఈ ఏడాది తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్కు 50 పడకల దవాఖానను లక్ష్మారెడ్డి మంజూరు చేశారని చెప్పారు.
తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలకు కలిసిరాని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఫెయిల్ అయిందని కార్యక్రమాలు చేస్తామంటున్నారని, ఇంత కన్నా సిగ్గుచేటు ఏమన్నా ఉంటదా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలోనూ వారు కలిసి రాలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఉత్సవాల్లో పాల్గొనబోమంటూ రాష్ట్ర ప్రజలను, ఉద్యమకారులను, తెలంగాణ జాతిని అవమానపరుస్తున్నారని అన్నారు. ఉద్యమం సమయంలో లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారని, జిల్లాలోని ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదని గుర్తుచేశారు. సకల జనుల సమ్మె జరుగుతుంటే ఏ ఒక్క కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అయినా హైదరాబాద్ విడిచి వచ్చిండ్రా? జనం తిరగబడ్తరు..రాజీనామా చేయమంటరని భయపడి దాక్కొన్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నాయకులు పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసులు వేసిన్రు. భూసేకరణ జరుగకుండా రైతుల్ని రెచ్చగొట్టిన్రు. ఇదే తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా? సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టించి ప్రజల కష్టాలు తీర్చాం. నాటి గంజి కేంద్రాలు పోయాయి.. వలసలు నిలిచిపోయాయి. శుభమా అని రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శకుని మాటలు మాట్లాడుతున్నరు.
-హరీశ్రావు
‘అక్కా చెల్లెళ్లకు నీళ్లిచ్చుడు ఫెయిలా? పాసా? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆడబిడ్డ పెండ్లికి లక్ష ఇవ్వడం ఫెయిలా? పాసా? ప్రతి ఎకరానికి రూ. పదివేల పెట్టుబడి సాయం అందించడం ఫెయిలా? పాసా? రూ. 200 ఉన్న పింఛన్ను రూ.2 వేలు చేయడం ఫెయిలా? పాసా? ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్తోపాటు తల్లీబిడ్డను ఇంటికాడ వాహనంలో విడిచిపెట్టడం ఫెయిలా? పాసా? ఉమ్మడి రాష్ట్రంలో కండ్లల్లో వత్తులు వేసుకుని చూసే కరెంట్ నాడుంటే.. నేడు నిరంతరం ఉచిత కరెంట్ ఇవ్వడం ఫెయిలా? పాసా.. మీరందరూ పాస్ అంటే.. కాంగ్రెసోళ్లు ఫెయిల్ అంటారేంటి?’ అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం మెచ్చుకొంటుంటే.. హిమాచల్ప్రదేశ్ సీఎం వచ్చి తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదని అంటున్నాడని మండిపడ్డారు. హిమాచల్ప్రదేశ్లో చాలా మంది గరీబోళ్లు పొట్టచేతబట్టుకొని హైదరాబాద్కు బతికేందుకు వలస వస్తున్నారని, అది తెల్సుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలో దేశంలోనే అతి ఎక్కువ వలసలున్న జిల్లా పాలమూరు అయితే.. నేడు పాలమూరుకే ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వస్తున్నారని స్పష్టంచేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్లో ఈరోజు నీళ్లు వచ్చాయంటే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారు కృషివల్లేనని చెప్పారు. రాష్ట్రంలో లక్షా యాభైవేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తున్నదని చెప్పారు. ‘కాంగ్రెస్ పాలన మాకొద్దు’ అని యావత్తు తెలంగాణ ముక్తకంఠంతో చెప్తున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.
మనం నిజం మాట్లాడకుంటే అబద్ధం రాజ్యమేలుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారని, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకొని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. ‘నిన్న కాంగ్రెసోళ్లు మాట్లాడుతూ మీరు ఇండ్లిచ్చినోళ్లనే ఓట్లు అడగాలే అన్నారు. అవును బరాబర్ మేం డబుల్ ఇండ్ల లబ్ధిదారులనే ఓట్లు అడుగుతాం.. రైతు బంధు సాయం పొందేటోళ్లనే అడుగుతాం.. కల్యాణలక్ష్మి తీసుకొన్నవాళ్లనే అడుగుతాం.. కేసీఆర్ కిట్ పొందినోళ్లనే అడుగుతాం.. నల్లా నీళ్లు తాగుతున్న అక్కా చెల్లెళ్లను ఓట్లు అడుగుతాం.. సాగు నీళ్లు అందుకుంటున్న రైతన్నను ఓట్లు అడుగుతాం’ అని పేర్కొన్నారు. వీళ్లందరూ ఓటేస్తే.. ఇంకెవరన్నా మిగులుతరా? అని ప్రశ్నించారు. ‘కాంగ్రెసోళ్లకు రైతుబంధు పైసలు పడ్తున్నయ్..కాంగ్రెసోళ్ల పిల్లలకు కల్యాణలక్ష్మి చెక్ వస్తున్నది’ అని చెప్పారు. పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించారని, అందుకే పాలమూరు ప్రాజెక్టును కట్టి చూపిస్తున్నారని తెలిపారు. గతంలో పాలమూరు వలసలకు ఫేమస్ అని, నేడు నాట్లు వేసేందుకు కర్నూల్, ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వస్తున్నారని చెప్పారు. తొమ్మిదేండ్లలోనే చరిత్రను తిరగరాశామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి మహబూబ్నగర్లోని 14 స్థానాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రం సిద్ధించాకే రేవంత్ టీపీసీసీ చీఫ్, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మీకు వచ్చిన పదవులు సీఎం కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? కానీ నేడు వారు ఆయన్ను తిట్టడానికే పోటీ పడుతున్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ కంటే ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక పార్టీలు పుట్టినా..ఎందరో నాయకులు పోరాడినా.. ఎవరూ సక్సెస్ కాలేదు. మధ్యలోనే కాడి వదిలేసిన్రు.. కానీ కేసీఆర్ చిట్టచివరి గమ్యాన్ని ముద్దాడే దాకా తన ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన్రు.
-హరీశ్రావు
తెలంగాణలో సీఎం కేసీఆర్ను ఢీ కొట్టే నేత ఎవరూ లేరని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనూ తెలంగాణ తరహా పథకాలు అమలు చేసేరోజు త్వరలోనే వస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నిరక్ష్యరాస్యత, అసమానతలు, దోపిడీని అరికడుతామని చెప్పారు. కరివెన రిజర్వాయర్తో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. దీటైన సమాధానం చేప్పేలా కార్యకర్తలు తయారు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో పాలమూరు జిల్లాలో ఎత్తిపోతల పథకాలను దగ్గరుండి పూర్తి చేయించారని గుర్తుచేశారు. పాలమూరు అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ అని పేర్కొన్నారు.
ఓ మూర్ఖుడు జడ్చర్లకు వచ్చి ఇష్టమొచ్చినట్టు వాగాడని, అలాంటివారి గురించి మాట్లాడకపోవడమే మంచిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ‘నాడు జడ్చర్ల దవాఖానలో జనరేటర్ లేదు.. వంద పడకల దవాఖాన కట్టలేదు..తెలంగాణలో ఐదేండ్ల కిందటే జననరేటర్ పెట్టినం.. వంద పడకల దవాఖాన నిర్మించినం’ అని తెలిపారు. ఈ అభివృద్ధిని దమ్ముంటే వచ్చి చూడాలని రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఎంస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు. ఇతర పార్టీల నుంచి ఎవరు వస్తారా? అని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం వైపు దేశం చూస్తున్నది. ఎన్ని కేసులు వేసినా.. అడ్డుకోవాలని చూసినా రేపోమాపో పాలమూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు పారించి జడ్చర్ల, మహబూబ్నగర్ను కృష్ణా జలాలు ముద్దాడేలా చేస్తాం.
-హరీశ్రావు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్రావు. చిత్రంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తదితరులు