సంగారెడ్డి సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, తడ్కల్ మండలాలు, మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. నారాయణఖేడ్లో పేదలకు గృహలక్ష్మి, షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆరు కులసంఘాల భవనాలు, పీఆర్టీయూటీఎస్, టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయింపు పత్రాలను అందజేశారు. పెద్దశంకరంపేటలో 96 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. 350 మందికి గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో సంబురాలు చేసుకోలేదని ప్రధాని మోదీ పేర్కొనడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సమాజం, ఉద్యమకారులు ఊరూవాడా సంబురాలు చేసుకున్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నదని, జీఎస్టీ గ్రోత్, తలసరి ఆదాయంలో టాప్లో ఉన్నదని వివరించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని, మోదీ కడుపులో తెలంగాణపై అక్కసు పెట్టుకుని విషం కక్కడం సరికాదని హితవు చెప్పారు. బీజేపీనే తెలంగాణకు అన్యాయం చేసిందని, ఆరు మండలాలు, సీలేరు డ్యామ్ను ఆంధ్రాలో కలిపి అన్యాయం చేసిందని విమర్శించారు. మోదీ తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా? గిరిజన యూనివర్సిటీకి నిధులు ఇచ్చారా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? అని నిలదీశారు.
ఆరునెలలకో సీఎం మారుతాడు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతాడని, ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ వస్తుందని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని, ప్రజల్లో ఉండరని తెలిపారు. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు హామీలు బోగస్ అని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. కర్ణాటకలో అమలు చేయలేని పథకాలు తెలంగాణలో అమలుచేస్తామని ప్రకటించడం ప్రజలను మోసగించటమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలో సరైన వైద్య సదుపాయాలు లేక సరిహద్దు ప్రాంతాల్లోని గర్భిణులు తెలంగాణలోని దవాఖానలకు వచ్చి డెలివరీలు చేయించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ను నమ్మితే కర్ణాటక ప్రజల మాదిరిగా మోసపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు మరోమారు కేసీఆర్ను సీఎంగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ నారాయణఖేడ్
సీఎం కేసీఆర్ పాలనలో నారాయణఖేడ్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో నారాయణఖేడ్ రైతులు బీదర్ వెళ్లి మక్కలు, శనగలు అమ్మాల్సి వచ్చేదని, ప్రస్తుతం కర్ణాటక రైతులే నారాయణఖేడ్ వచ్చి మక్కలు, శనగలు అమ్ముతున్నారని చెప్పారు. ఏడాదిన్నరలో బసవేశ్వర ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణఖేడ్ను సస్యశ్యామలం చేస్తామని, భూపాల్రెడ్డిని మరోమారు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాల సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.