హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ దేశానికే దిక్సూచిగా మారిందని, ఇక్కడి పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. వ్యవసాయరంగం విషయంలో కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గురువారం ఆయన ఒక న్యూస్ చానల్ నిర్వహించిన కాన్క్లేవ్లో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే రీతిలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
రైతుబంధు, మిషన్భగీరథ పథకాలను కేంద్రం కూడా అమలుచేస్తున్నదని ఉదహరించారు. మిషన్ కాకతీయ పథకాన్ని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా ప్రజల అవసరాలను వంద శాతం తీర్చలేదని చెప్పారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించలేదని, సీఎం కేసీఆర్ తాగునీరు, విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని వివరించారు.
మార్పు అంటే ప్రజల జీవన స్థితిగతులు మారాలి
మార్పు అంటే ప్రజల జీవన స్థితిగతులు మారాలని, పదవుల మార్పు కాదని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ, పట్టణ ప్రజల జీవన స్థితిగతులు మారాయని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పెరిగిందని, ప్రభుత్వ దవాఖానల్లో మార్పులు తెచ్చామని, మహబూబ్నగర్లో వలసలు ఆగిపోయాయని వివరించారు. దేశం మొత్తం భూగర్భజలాలు పడిపోయినా.. తెలంగాణలో 6.5 మీటర్ల నీటి మట్టం పెరిగిందని చెప్పారు. వేసవి వచ్చిందంటే అంబలి కేంద్రాలు ఉండే తెలంగాణ.. ప్రస్తుతం 10 రాష్ట్రాలకు తిండి పెడుతున్నదని పేర్కొన్నారు. తమకు బియ్యం సరఫరా చేయాలని కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు లేఖలు రాస్తున్నాయని వెల్లడించారు.
విద్యుత్తు మీటర్ల విషయంలో కేంద్రం రాష్ర్టాల మెడపై కత్తి పెట్టిందని విమర్శించారు. బోరుబావుల వద్ద మీటర్లు పెడితే 0.25 శాతం నిధులు అధికంగా ఇస్తామని చెప్పినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల కోసం దానికి అంగీకరించలేదని స్పష్టంచేశారు. పెన్షన్లు తీసుకుంటున్న 45 లక్షల మంది, రైతుబంధు తీసుకుంటున్న 69 లక్షల మంది, కల్యాణలక్ష్మి తీసుకుంటున్న ఆడపిల్లలు, దివ్యాంగులు సీఎం కేసీఆర్ను అక్కున చేర్చుకొని ఓట్లు వేస్తారన్న విశ్వాసం వ్యక్తంచేశారు. వారి దీవెనలు తమకు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో లాభం పొందని ప్రజలే లేరని పేర్కొన్నారు.