BRS | ఉత్తరప్రదేశ్లో కరెంటు తీగలు లేక రైతులు డీజిల్ ఇంజిన్లు, ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని పొలంలో నీరు పారించుకొనేందుకు మోటర్లు నడుపుకొంటున్నరు. తెలంగాణలో ఎక్కడైనా ఆ పరిస్థితి ఉన్నదా? టార్చ్లైట్ పెట్టి వెతికినా తెలంగాణలో ఆయిల్ ఇంజిన్లు కనబడవు. కరెంటు సమస్యను ఆరు నెలల్లో అధిగమించింది కేసీఆర్ కాదా? బీజేపీ రాష్ర్టాలది డబుల్ ఇంజిన్ కాదు.. ఆయిల్ ఇంజిన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి. యూపీ, మహారాష్ట్రలో 8 గంటలే కరెంటు. పొద్దున 3 గంటలు, దొంగరాత్రి 5 గంటలు ఇస్తున్నరు. మన దగ్గర 24 గంటలు కరెంటు వస్తున్నది వాస్తవం కాదా?
గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి కేసీఆర్తో సవాల్ చేసి ఓడిపోయారు. ఆరునెలల్లో 24 గంటలు కరెంటు ఇస్తానన్న కేసీఆర్ మాటలను నమ్మలేకపోయారు. నిజంగానే ఇస్తే చమత్కారమే అన్నరు. మరిప్పుడు 24 గంటల కరెంటు చమత్కారమా? విచిత్రమా? కాంగ్రెసోళ్లే ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ మంత్రం వేసిండా? అల్లావుద్దీన్ దీపం ఉన్నదా? మాయ చేస్తే వచ్చిందా? చెమటోడ్చి కష్టపడి కేసీఆర్ నిజం చేసిండు. కేసీఆర్ పట్టుదల, కృషి ఉన్నది కనుకనే గొప్ప కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలు. బతుకు దెరువు లేక, నీళ్లు లేక ప్రజలు వలస పోయారు. కాంగ్రెస్వాళ్లది మైగ్రేషన్ పాలన అయితే.. బీఆర్ఎస్ది ఇరిగేషన్ పాలన.
– మంత్రి హరీశ్రావు
నిజామాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలతో బతుకు దెరువు, నీళ్లు లేక ప్రజలు వలస పోయారని, కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు, నిజామాబాద్, కామారెడ్డి బిడ్డలు బొంబాయి, దుబాయ్కి వలసపోయారని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారని, రైతుబంధును దేశంలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవ్వరూ ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీజేపీ ఖతం అయిపోయిందని, ఈ మధ్యే ఎల్లెలుకల పడ్డదని పేర్కొన్నారు. ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టే కనిపిస్తున్నదని విమర్శించారు. అందుకే ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు చాలా మంది నాయకులు తొంగి చూస్తున్నారని చెప్పారు.
బీజేపీలో ఉంటే ప్రయోజనం లేదని, అందులో నూకలు చెల్లాయని భావించి, లాభం లేదనుకొని గులాబీ జెండా వైపు చూస్తున్నారని వెల్లడించారు. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కేట్టు లేదని తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి హరీశ్రావు సుడిగాలి పర్యటన చేశారు. నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్ గ్రామంలో పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువపై రూ.50 లక్షలతో నిర్మించనున్న సింగిల్ లేన్ వంతెన, ఎల్లారెడ్డి పట్టణంలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీపాటిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ జితేష్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. గండిమాసానిపేటలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం లింగంపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. తెలంగాణలో 10 శాతం సీట్లు వస్తే చాలనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ పాకులాడుతున్నదని, ప్రతిపక్ష హోదా కోసం తంటాలు పడుతున్నదని విమర్శించారు. కేసీఆర్ బలపడితే తెలంగాణకు మంచిగైతదని, గొర్రెలు బలిస్తే గొల్లాయనకు లాభం అన్నట్టు.. కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణిస్తే తెలంగాణ రాష్ర్టానికే పెద్దపీట దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత మంచి జరుగుతుందని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పినా సొంత గడ్డపై ప్రేమ ఉంటదని చెప్పారు. 44 డిగ్రీల ఎండలోనూ సభకు ఇంత మంది రావడమే బీఆర్ఎస్ బలానికి నిదర్శనమని స్పష్టంచేశారు.
మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు తెచ్చారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కల్యాణలక్ష్మి, ఆరోగ్య మహిళ, ఆరోగ్య లక్ష్మి పథకాలు ఉన్నాయి. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116 ఆర్థిక సాయం అందుతున్నది. అదే గుజరాత్లో ఆడబిడ్డలకు రూ.12 వేలు అందిస్తున్నరు. అది కూడా రెండేండ్లకు ఇస్తున్నరు. రూ.లక్ష చొప్పున పేదింటికి కేసీఆర్ ఇస్తున్నరు. ఇది ఎక్కడైనా ఉన్నదా? కాంగ్రెస్ హయాంలో ఉన్నదా? ప్రజలు ఆలోచన చేయాలే.
– మంత్రి హరీశ్రావు
డబుల్ ఇంజిన్ కాదు.. ఆయిల్ ఇంజిన్ పాలన
మహారాష్ట్రలో తెలంగాణ లెక్క స్కీములు కావాలని రైతులంతా పోరాటం చేస్తే మన తరహా పథకాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓ కమిటీని వేసిందని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ పథకాల అమలుకు కమిటీని వేశారంటే మన పనితీరుకు కితాబు ఇచ్చినట్టే కదా, కేసీఆర్ సర్కారు పనితనానికి గుర్తింపు ఇచ్చినట్టే కదా అని పేర్కొన్నారు. మన వద్ద ఉన్నన్ని పథకాలు దేశంలో మరెక్కడా లేవని, మన పనితీరు బాగున్నదనే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో కరెంటు తీగలు లేక రైతులు డీజిల్ ఇంజిన్లు, ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని పొలంలో నీరు పారించుకునేందుకు మోటర్లు నడుపుకొంటున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. టార్చ్లైట్ పెట్టి వెతికినా ఆయిల్ ఇంజిన్లు కనిపించవని స్పష్టంచేశారు. వారిది డబుల్ ఇంజిన్ కాదు.. ఆయిల్ ఇంజిన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నదని ఎద్దేవాచేశారు. యూపీ, మహారాష్ట్రలో 8 గంటలే కరెంటు ఇస్తారని, పొద్దున 3 గంటలు, దొంగ రాత్రి 5 గంటలు అని వివరించారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు వస్తున్నది వాస్తవం కాదా? అని అడిగారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి ఒకసారి కేసీఆర్తో సవాల్ చేసి ఓడిపోయారని, ఆర్నెళ్లలో 24 గంటలు కరెంటు ఇస్తానంటే కేసీఆర్ మాటలను నమ్మలేకపోయారని, నిజంగానే కరెంటు ఇస్తే చమత్కారమే అన్నారని, మరిప్పుడు 24 గంటల కరెంటు చమత్కారామా? విచిత్రమా? కాంగ్రెసోల్లే ఆలోచన చేసుకోవాలని చెప్పారు. కేసీఆర్ మంత్రం వేసిండా? అల్లావుద్దీన్ దీపం ఉన్నదా? మాయ చేస్తే వచ్చిందా? చెమటోడ్చి కష్టపడి కేసీఆర్ నిజం చేశారని నొక్కి చెప్పారు. కేసీఆర్ పట్టుదల, కృషి ఉన్నది కనుకనే గొప్ప కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను బంద్ చేస్తారట. బంగాళాఖాతంలో వేస్తారట. వారికి అవకాశమిస్తే ఏమైతదో అందరికీ తెలిసిందే. ధరణిని తీసేస్తే పైరవీకారులు పుట్టుకొస్తరు. వీఆర్వోలు వస్తరు. లంచాలు, పైరవీలు పెరుగుతాయి. పాస్బుక్కు లంచం, రిజిస్ట్రేషన్కు లంచం, ప్రతిదానికీ లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ధరణితో పొద్దున పోతే అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నది. మునుపటి ఇబ్బందులేవీ ధరణి వచ్చినంక కనిపిస్తలేవు.
– మంత్రి హరీశ్రావు
విషం చిమ్మే పార్టీలను విషయంతో తిప్పి కొట్టాలి
కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని, వారిపై బీఆర్ఎస్ కార్యకర్తలంతా విషయంతో తిప్పికొట్టాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చెప్పినట్టు.. నిజాన్ని చెప్పకపోతే, ప్రచారంలో నిలబెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుందని, నిజం చెప్పకపోతే ఈ కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. నిజాన్ని ఎప్పుడు ప్రచారంలో ఉంచాలని, చర్చ పెట్టాలని, లేకపోతే ఈ రెండు పార్టీలతో రాష్ర్టాలు, దేశాలు ఆగమవుతాయని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందని, ఏం మేలు జరిగిందని కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు అంటున్నారని, వాళ్లది నాలుకనా? తాటి మట్టనా? అని ధ్వజమెత్తారు. అవ్వా, తాతలను అడిగినా బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పరా? ప్రశ్నించారు.
వైద్యంలో తెలంగాణ ఆదర్శం
వైద్యరంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు తెలంగాణలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయని హరీశ్రావు చెప్పారు. దేశంలో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని వివరించారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదని, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్సు పాస్, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో వందకు 30 శాతం డెలివరీలు అయితే, స్వరాష్ట్రంలో 69 శాతం డెలివరీలు అవుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. వైద్యం కోసం హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేదని, కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నదని చెప్పారు. 10 శాతం రిజర్వేషన్ వల్ల తెలంగాణలో పేద గిరిజన విద్యార్థులకు వైద్య విద్య నేర్చుకొనే అవకాశం లభించిందని, బీ క్యాటగిరీ సీట్లల్లో లోకల్ రిజర్వేషన్ 80 శాతం ఇవ్వడం వల్ల స్థానిక విద్యార్థులకు వైద్య విద్య చదువుకొనే అవకాశం దొరుకుతున్నదని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన ఏర్పాటుచేస్తున్నామని, ఎల్లారెడ్డికి కూడా మంజూరు చేసి శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. అన్ని రకాల వైద్య సదుపాయాలతో నూతన వైద్యశాల నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. జూన్ 24 నుంచి పోడు భూములకు పట్టాలు అందించబోతున్నామని హరీశ్రావు తెలిపారు. పట్టాలతోపాటు రైతుబంధు, రైతుబీమా కూడా అమలుచేయబోతున్నామని వివరించారు.
మొన్నీమధ్యే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి సభకు 500 మంది కూడా రాలేదు. అయినా గెలుస్తామని ఏదేదో మాట్లాడిండు. కాంగ్రెస్ పాలన కావాల్నా అంటే జనాలంతా వద్దు బాబోయ్ మీ పాలన అంటూ తిరస్కరిస్తున్నరు. కాంగ్రెస్కు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులే దిక్కులేరు. అయినా గెలుస్తామని పగటి కలలు కంటున్నరు. కాంగ్రెస్ పాలన అంటే దొంగ రాత్రి కరెంటు. రూ.2 వేల పింఛన్ బంద్ చేసి రూ.200 ఇస్తరు. కల్యాణలక్ష్మి బంద్ అయితది. ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. చెప్పులను వరుసలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాగడానికి నీళ్లు దొరకవు. రైతుబంధు ఉండది. గిసొంటి బాధలు మళ్లీ ఎవరికి గావాలే.
– మంత్రి హరీశ్రావు
డబుల్ బెడ్రూం కోటాలో డబుల్ కోటా
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లారెడ్డి అంటే ప్రత్యేక ప్రేమ అని, త్వరలోనే ఇక్కడికి వచ్చి వరాలు కురిపిస్తారని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బడుల్ బెడ్రూం ఇండ్ల కోటాలో డబుల్ కోటా ఇస్తామని చెప్పారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, మన గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్లోకి ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎంపీపీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి ఎంపీపీ కర్రె మాధవీ బాల్రాజ్గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం లింగంపేట్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎల్లారెడ్డిలో తాగునీళ్ల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డమో తెలియదా? మన ఆడబిడ్డలు గతంలో తాగునీళ్ల కోసం ట్యాంకర్ల వెనుక పోయిన రోజులు ప్రజలకు గుర్తున్నయ్. తెలంగాణ వస్తే ఏం వచ్చిందో ఏ పల్లెకు పోయినా కనిపిస్తున్నది. ఇన్నేండ్లలో ఎవ్వరూ చేయని పనిని మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కారు అంటున్న మహారాష్ట్రలో 10 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుంది. పుణె, నాందేడ్, ఔరంగాబాద్, నాగపూర్ వంటి నగరాల్లోనూ ఐదారు రోజులకు ఒకసారి తాగునీళ్లు ఇచ్చేందుకు తండ్లాడుతున్నరు. నీళ్లిచ్చేందుకు చాతకాని ప్రభుత్వమే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు. తెలంగాణలో నీళ్ల యుద్ధాలు, ఖాళీ బిందెలతో ధర్నాలు లేవు.
– మంత్రి హరీశ్రావు