Minister Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని, రైతులపై పగబట్టిన కాంగ్రెస్కు రైతులు పొగబెట్టడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీని రైతులు విడిచిపెట్టరని చెప్పారు. రైతుల తెరువుకొస్తే ఖబర్దార్ అని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఏర్పడేది సీఎం కేసీఆర్ నాయత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 11 సార్లు అవకాశం కల్పిస్తే ప్రజలను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని, అదే బీఆర్ఎస్కు రెండు అవకాశం కల్పిస్తే 11 సార్లు రైతుబంధును వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని అన్నారు. తలకిందుల తపస్సు చేసినా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వెయ్యబోరని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
యాసంగి రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంపై మంత్రి హరీశ్ తీవ్రంగా మండిపడ్డారు. రైతుబంధును నిలిపివేయాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయటం చూస్తే, ఆ పార్టీకి రైతులు అంటే ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమైందని అన్నారు. రైతుబంధు కొత్త పథకం కాదని, ఆరేండ్లుగా 11 విడతల్లో దాదాపు రూ.75 వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేసిన పథకమని వివరించారు.
రాష్ర్టంలోని 69 లక్షల మంది రైతుల పక్షాన కేసీఆర్ నిలబడ్డారని తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం తగ్గినా కేసీఆర్ రైతుబంధును ఆపలేదని, కానీ ఎన్నికల కోసం ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తున్నదని మండిపడ్డారు. రైతుల పట్ల కుట్రపూరిత నీతిని అనుసరిస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
రైతులు అనుకూలంగా లేరన్న అక్కసుతోనే..
రైతులు తమకు అనకూలంగా లేరనే అక్కసుతోనే రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వానకాలం, యాసంగిలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు అందుతున్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే ఆసరా పింఛన్లను, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ను, బడిపిల్లలక పొద్దున అల్పాహారం టిఫిన్ కూడా నిలిపివేయాలంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. యాసంగి కోసం 12వ సారి రైతుబంధు ఇవ్వబోతుంటే ఈసీకి కాంగ్రెస్ ఎలా ఫిర్యాదు చేస్తుందని ప్రశ్నించారు. ఆ పార్టీ 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని గుర్తుచేశారు.
వెతల కాంగ్రెస్.. వెలుగుల బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి హరీశ్ చెప్పారు. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉంటే ఆ రోజు నీళ్లు ఇవ్వపోయినా నీటి తీరువాను వసూలు చేసిందని, కరెంటు ఇవ్వలేదని, పండిన పంటను కొనలేదని, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో మార్చలేదని, పగటిపూట కరెంట్ ఇవ్వకపోతే రాత్రిపూట బావుల దగ్గర పడుకుంటే పాములు, తేళ్లు కుట్టుడు రైతులు చనిపోయిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
ఇప్పుడా పరిస్థితి ఉందా? అని అడిగారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నారని వివరించారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్ చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబంధు పొందిన 69 లక్షల మందిరైతులు కాంగ్రెస్కు కర్రుకాల్చి వాతపెడతారని తెలిపారు.
కర్ణాటక కరెంట్ కష్టాలు మనకు కావాల్నా?
కర్ణాటక రైతులు గద్వాల, కొడంగల్ సహా అనేక నియోజకవర్గాల్లో తిరుగుతూ ‘కాంగ్రెస్ను నమ్మి మేం మోసపోయినం..పెనం మీదికెళ్లి పొయ్యిల పడ్డట్టు మా బతుకు అయ్యింది. మీరూ మాలా మోసపోవద్దు’ అని చెప్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తాము కరెంట్ ఇవ్వలేమని కర్ణాటక మంత్రే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తానన్న 5 గంటలు కూడా ఇవ్వకపోవటంతో రైతులు ఆగ్రహంతో సబ్స్టేషన్ల ముందు మొసళ్లతో నిరసన తెలుపుతున్నారని (ఫొటోలను ప్రదర్శిస్తూ) ఉదహరించారు. కర్ణాటక రైతులు పురుగుల మందు తాగుతూ, సబ్స్టేషన్ల ముందు ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి మనకు వద్దని రైతులకు సూచించారు.
వాళ్లు పీ‘ఛీఛీ’ అధ్యక్షులు
పీసీసీ అధ్యక్షులు పీ‘ఛీఛీ’అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధును దుబారా అని, దండుగ పథకం అని గతంలో పేర్కొన్నారని తెలిపారు. దీన్నిబట్టే వీళ్ల పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుందని అన్నారు. ‘మా నాయినమ్మ చనిపోతే బాయికాడ స్నానం చేద్దామని పోతే కరెంట్ రాలేదు. కరెంట్ కోసం ఎదురు చూసి ఎదురుచూసి నెత్తిమీద నీళ్లు చల్లుకొని పోయిన’ అని రేవంత్రెడ్డి నాడు అసెంబ్లీలో అనలేదా? అని అన్నారు.
కాంగ్రెస్ నేతలు ముక్కునేలకు రాయాలి
కాంగ్రెస్ నేతలకు రైతుల మీద ఏమైనా ప్రేమ ఉంటే చెంపలేసుకొని, ముక్కునేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని అన్నారు. రైతుబంధు, దళితబంధు, గొర్ల పంపిణీని ఆపాలని ఫిర్యాదు చేసి, కాంగ్రెస్ తన దివాలాకోరుతనాన్ని మరోసారి బయటపెట్టుకున్నదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ సమక్షంలో పటాన్చెరు బీజేపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ బీఆర్ఎస్లో చేరారు.
రుణమాఫీ చెల్లింపులపై ఈసీకి లేఖ
రాష్ట్రంలో రుణమాఫీని తాము దశల వారీగా రైతులకు చేస్తూ వచ్చామని, ఇంకా రూ.3 వేల కోట్ల రుణమాఫీ చెల్లింపు పెండింగ్లో ఉన్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర అధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తే మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.