సిద్దిపేట, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందులో భాగంగానే రైతుల వడ్లు కొంటున్న 2,900 రైసుమిల్లుల్లో తనిఖీలను చేపట్టిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. గురువారం మంత్రి హరీశ్రావు సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్లను పరిశీలించి,రైతులను పలుకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో చాలాచోట్ల వడ్లు తడిసిపోయాయని, తడిసిన ధాన్యం అరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.
రైతులు కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తీసుకొస్తే అదేరోజు కొనడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ఆరబెట్టకుండా మార్కెట్యార్డు, ఐకేపీ సెంటర్లకు తెచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఆరబోస్తే అకాల వర్షం కురిసినప్పుడు తడుస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉన్నదని. కానీ, తెలంగాణ వడ్లు కొనబోమని, మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతున్నదని విమర్శించారు. రా రైస్ కొంటం, బాయిల్డ్ రైస్ కొనబోమని రైతులను మోసం చేశారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. రూ.3 వేల కోట్ల భారమైనా భరించి రైతులను కాపాడుకొంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులపై కక్షకట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొంటున్న సమయంలోనే 2,900 మిల్లులపై దాడులతో ధాన్యాన్ని కొనకుండా చేస్తున్నదని ఆరోపించారు. ఒక నెల ఆగి తనిఖీలు చేస్తే ఏమైతదని, దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని మంత్రి ధ్వజమెత్తారు.
వడ్లు కొనద్దనే మిల్లులపై దాడులు
తెలంగాణ వడ్లు కొనొద్దు, రైతులు నష్టపోవాలి అన్న కోణంలో కేంద్రం ఎఫ్సీఐ అధికారులతో మిల్లులపై దాడులు చేయిస్తున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మిల్లు యాజమాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకొని సీజ్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. లారీల్లో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థ్ధితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాము తనిఖీలు వద్దని అనడం లేదని, ఒక నెల ఆగితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని చెప్పారు. కేంద్రం వడ్లు కొనబోమని చెప్తే, రైతుల కోసం కేసీఆర్ రూ.3 వేల కోట్లతో ధాన్యం కొనాలని నిర్ణయం తీసుకొన్నారని స్పష్టం చేశారు.
ఇప్పుడు మిల్లర్లు ధాన్యం దించుకోకుండా ఎఫ్సీఐతో దాడులు చేయిస్తున్నదని, రైతుల్లో తెలంగాణ ప్రభుత్వంపై కోపం పెరిగేలా బీజేపీ కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలను తెలంగాణ రైతాంగం గమనించాలని విజ్ఞప్తిచేశారు. నల్ల వ్యవసాయ చట్టాలు, బాయిలకాడ మీటర్లు, డీజిల్ ధరల పెంపు.. రైతుల కోసం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉన్నదా అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం తదితరులు ఉన్నారు.