Minister Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి, బీజేపీకి ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. అయినా, వారి కుట్రలు చెల్లవని, ప్రజల మనసుల్లో సీఎం కేసీఆరే ఉన్నారని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ కాపీ కొట్టిందని స్పష్టం చేశారు. కర్ణాటకలో రియల్టర్లు, బిల్డర్లు అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.75 చొప్పున వసూలు చేస్తున్నదని తెలిపారు. ఆ సొమ్మును తెలంగాణలో ఖర్చు పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు. కర్ణాటకలో నిల్వ ఉంచిన రూ.87 కోట్లను అధికారులు సీజ్ చేశారని గుర్తు చేశారు. కర్ణాటక నుంచి డబ్బు తీసుకొచ్చి తెలంగాణలో ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, కానీ తెలంగాణ ప్రజలు అమ్ముడుపోరని తెలుసుకోవాలని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా వరుసగా మూడు సార్లు అధికారంలోకి రాలేదని, తొలిసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని తేల్చిచెప్పారు.
పొరుగు రాష్ర్టాలను చూస్తే తెలుస్తది
ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలనను పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ర్టాలతో పోల్చుకుంటే సరిపోతుందని అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలోనే అమలు అవుతున్నాయని వెల్లడించారు. ఈ పరిణామాలను ప్రజలు సోషల్ మీడియాలో చూస్తున్నారని వివరించారు.
కాగా, మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగిపోవడంపై రాద్ధాంతం చేయొద్దని మంత్రి హరీశ్ సూచించారు. కాళేశ్వరంతో వచ్చే నీళ్లతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలకు మొదటి నుంచీ కాళేశ్వరం తప్పుగా కనిపిస్తున్నదని మండిపడ్డారు. ఇటీవల గరిష్ఠంగా 28 లక్షల క్యుసెక్కుల వరద వచ్చినా బరాజ్ తట్టుకున్నదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల పిల్లర్లు ఉన్నాయని, అందులో ఒకటి రెండు కుంగిపోతే పెద్ద సమస్యగా చూడొద్దని తెలిపారు. కుంగుబాటుకు కారణాలు ఇంకా తెలియలేదని, విచారణ జరుగుతున్నదని వివరించారు. ఏదేమైనా రెండు, మూడు నెలల్లో ఆ పిల్లర్లను ఏజెన్సీ సరిచేస్తుందని స్పష్టం చేశారు.