రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ జీవితం ధన్యమైంది.ప్రధాని తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి మా పదవులు గెలిస్తే వచ్చాయి.. మీ మంత్రుల్లా నామినేటెడ్ ద్వారా రాలేదు
– హరీశ్రావు
మహబూబ్నగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీది ఢిల్లీలో ఒకమాట.. ఇక్కడోమాట అని మంత్రి తన్నీరు హరీశ్రావు ఫైరయ్యారు. బుధవారం నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని కోస్గి, మక్తల్, కొత్తకోట, మదనాపురంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. మూడు బహిరంగ సభల్లో మాట్లాడారు. నిన్న నిజామాబాద్ వచ్చిన మోదీ నీతులు చెప్పే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆయన పూటకో మాట.. రాష్ర్టానికో మాట మాట్లాడుతుంటాడని విమర్శించారు. పార్లమెంట్లో మాట్లాడి మన అద్భుతంగా పనిచేస్తున్నడాని, కేసీఆర్ ఎప్పుడు అడిగినా నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి, కరెంట్ గురించి అడుగుతాడని, మంచిగా మాట్లాడతాడు, అభివృద్ధి గురించి మాట్లాడతాడని చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ నాయకుడు వస్తే కేసుల గురించి మాట్లాడతాడని.. కేసీఆర్ మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడతారని పార్లమెంటులో చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంటులో ఒకమాట, బయట మరోమాట చెబుతాడని విరుచుకుపడ్డారు.
మరి వాళ్లెవరు?
తెలంగాణకు వచ్చి కుటుంబ పాలన అంటాడని, కర్ణాటకలో దేవగౌడ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రధాని అక్కడేం చెబుతారని హరీశ్రావు ప్రశ్నించారు. ప్రధాని క్యాబినెట్లో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా ఎవరు? నారాయణ్రాణే ఎవరు? అనురాగ్ ఠాకూర్ ఎవరు? పీయూష్ గోయల్ ఎవరు? దీనికి సమాధానం చెప్తారా.. అని నిలదీశారు. మీవ్వు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాము ప్రజల ఓట్లతో గెలిచి వచ్చామని, నామినేటెడ్ ద్వారా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రధాని స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా అని రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ డబులింజన్ పాలన ఉన్న మహారాష్ర్టాలోని నాందేడ్ ఆసుపత్రిలో రెండు రోజుల్లో 30 మంది పసిపిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడుతుందని హెచ్చరించారు. రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. మళ్లీ గెలిపిస్తే మరింత గెలిచి చూపిస్తామని తెలిపారు.
ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా మ్యానిఫెస్టో
16న వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని, అక్కడ సీఎం కేసీఆర్ మ్యానిపెస్టో ప్రకటిస్తారని, ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటుందని, ఈ శుభవార్త వినడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. కేసీఆర్ బీజేపీకో, కాంగ్రెస్కో బీ-టీం కాదని, తమది ప్రజల టీం అని, తెలంగాణ టీం అని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి తదతరులు పాల్గొనారు.