Harish Rao | హైదరాబాద్ : వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నది. అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్ అదే పరిస్థితి కొనసాగించిందని హరీశ్రావు ధ్వజమెత్తారు.
తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అర్థరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది. ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టింది. 2009లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. నీళ్ళు ఇవ్వలేదు. సాగు, మంచినీళ్ల కోసం అసెంబ్లీ వద్ద మేము ధర్నా చేస్తే పట్టించుకోలేదు. నాడు అధికారంలో ఉండి రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది అని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
అక్టోబర్ 23న మాణిక్ రావు థాక్రే రైతుబంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని హరీశ్రావు గుర్తు చేశారు. రైతుబంధు ఆపాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టి చెప్పారు. భట్టి విక్రమార్క రైతుబంధు దుబారా ఆంటే, రేవంత్ రైతులను బిచ్చగాళ్లు అని పేర్కొన్నారు. రైతుబంధును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం అని తప్పు మాట్లాడుతారు. రైతుల నోటి కాడి బుక్కను లాగేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ది చెప్పాలి అని హరీశ్రావు సూచించారు.