హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మరిస్తుందని రాహుల్ చేసిన ట్వీట్పై హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని రాహుల్కు మంత్రి చురకలంటించారు.
తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆందోళన చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయాలని సూచించారు. ఒకే దేశం – ఒకే సేకరణపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోవద్దు అని హరీశ్రావు పేర్కొన్నారు.
‘One Nation One Procurement’ పై మీ పార్టీ @INCIndia స్టాండ్ ఏంటో ముందు చెప్పండి. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోకండి.
— Harish Rao Thanneeru (@trsharish) March 29, 2022