జోగులాంబ గద్వాల : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీలను అవమానం చేస్తారా? అంటూ మండిపడ్డారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో 300 పడకల జిల్లా ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు ప్రసంగించారు. 1969 నుంచి కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కొంటున్నది. ఎప్పటిలాగానే ధాన్యాన్ని కొనాలి అంటే కొనేదే లేదని చెప్పడం దారుణమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని అడిగితే అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు.
రైతుల ఓట్లు కావాలి. కానీ అదే రైతు పండించిన వడ్లను మాత్రం కొనరా? అని హరీశ్రావు ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు పోరాటం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంటే.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మౌనంగా ఉండటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతుల ఉసురు ఉసురు బీజెపీకి తగులుతుందని హరీశ్రావు అన్నారు.