హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. వారు నిస్సారమైన విమర్శలు చేస్తున్నారు తప్ప.. వారికి నిర్మాణత్మమైన ధోరణి లేదని విమర్శించారు. తాము అప్పులు తగ్గించుకుంటూ వస్తుంటే.. కేంద్రం అప్పులు పెంచుకుంటూ పోతుందని ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ జరిగిన సందర్భంగా మంత్రి హరీశ్రావు అప్పులపై వివరణ ఇచ్చారు.
ఈ రాష్ట్రం యొక్క జీఎస్డీపీ ఎంత..? దానిలో ఎంత శాతం ఈ రాష్ట్రం అప్పులు కలిగి ఉన్నది. అది అప్పులను చూసేటటువంటి పద్ధతి అని మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పులు ఇన్ని లక్షల కోట్లు పెంచారని విపక్ష సభ్యులు అంటున్నారు. మరి జీఎస్డీపీ ఎన్ని లక్షల కోట్లు పెరిగిందో కూడా చెప్పాలి కదా? అని హరీశ్రావు అడిగారు. రాష్ట్రం ఏర్పడినప్పడు జీఎస్డీపీ నాలుగున్నర లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు పదమూడున్నర లక్షల కోట్లకు చేరిందన్నారు. పెరిగిన ఆస్తి గురించి కూడా ఆలోచించాలి. అప్పుల విషయంలో 24.3 నుంచి 23.8 శాతానికి తగ్గించామన్నారు. ఇది ఆర్థిక పరిపుష్టికి నిదర్శనం అని హరీశ్రావు స్పష్టం చేశారు. కేంద్రంలో అప్పులు పెరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చేసరికి అప్పులు తగ్గుతున్నాయి. ఎవరి పాలన బెస్ట్ అనేదానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. ఈ దేశ ప్రజలపై నెలకు లక్ష కోట్ల అప్పు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఒక రోజుకు వీరు తీసుకునే అప్పు రూ. 4,618 కోట్లు. గంటకు తీసుకునే అప్పు రూ. 192 కోట్లు. నెలకు వీరు కట్టే వడ్డీ.. రూ. 2,959 కోట్లు. వీళ్లా అప్పుల విషయంలో మాకు నీతులు చెప్పేది అని హరీశ్రావు దుయ్యబట్టారు.