హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్దాంతం. కానీ బీజేపీ వాళ్లకు పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు అన్నచందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని పేద ప్రజలకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.
చివరకు పారాసిటామల్ మెడిసిన్ ధరను కూడా మోదీ ప్రభుత్వం పది శాతం పెంచిందని హరీశ్రావు గుర్తు చేశారు. కరోనా తర్వాత పారాసిటామల్ వాడకం ఎక్కువైందన్నారు. ఇదే అదునుగా భావించిన కేంద్రం.. ఆ మెడిసిన్స్ ధరలు పెంచడం సరికాదన్నారు. ఒక్క పారాసిటామల్ మెడిసిన్ ధరలే కాదు.. 898 మెడిసిన్ల రేట్లు 10.7 శాతం పెరిగాయన్నారు. భారతదేశ చరిత్రలో ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో అత్యవసర మందుల ధరలు పెంచిన దుర్మార్గ చరిత్ర ఇంకెవరికీ లేదన్నారు. ఆ ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
బీజేపీ సర్కారు చర్యలు చెప్పుకుంటే, గుండె అవిసిపోతదని హరీశ్రావు అన్నారు. కానీ, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతలు చూస్తే.. అవార్డులు, పురస్కారాల లిస్టే ఒక సెషన్ అంతా చెప్పొచ్చు అని హరీశ్రావు స్పష్టం చేశారు.