హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై అనుచితంగా మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో బొక్క బొర్లా పడ్డా నీవు.. తెలంగాణకు వచ్చి పెద్ద డైలాగులు కొడుతున్నావు అని నడ్డాను ఉద్దేశించి హరీశ్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మీడియాతో హరీశ్రావు మాట్లాడారు.
నిన్నటి కరీంనగర్ సభలో ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడలేదు. సొల్లు పురాణం మాట్లాడిపోయిండు. మునుగోడులో ఓడిన తర్వాత కూడా జ్ఞానోదయం కాలేదు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోవాలి. నడ్డా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి ఎప్పుడు నిర్మిస్తారు. మునుగోడులో వేసిన ఆ శిలాఫలకం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మేం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న అధికారంగా నిర్వహిస్తాం అని అంటున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. స్క్రిప్టు రాసిచ్చిన వారు అది కూడా చెప్పలేదా? అప్డేట్ కావాలని నడ్డాకు సూచిస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.
కేంద్రం కంటే మేం చాలా ముందున్నాం. చాలా ఎత్తున ఉన్నాం. మా పథకాలు బాగా లేకుంటే మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు. రైతుబందు, మిషన్ భగీరథ, కాకతీయ, మూగజీవాల కోసం 1962, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపీ కొట్టలేదా? పథకాలు మావి పబ్లిషిటీ మీది. మీవి నకిలీ పథకాలు. చెప్పేది ఎక్కువ.. చేసేది తక్కువ. బరితెగించి మాట్లాడే సంస్కృతి మానాలని కోరుతున్నాను. ఒక చేత్తో అవార్డులు ఇస్తారు. గల్లీలో వచ్చి తిడుతుంటారు. అవార్డు రాని డిపార్ట్మెంట్ లేదు. అవార్డు రాని నెల లేదు. అవార్డు రాని రంగం లేదు. అవార్డు రాని రంగం ఏదో చెప్పాలి. ఢిల్లీలో అవార్డులు.. గల్లీలో రాజకీయ విమర్శలు. పని చేయకపోతే మీరు ఎందుకు అవార్డులు ఇస్తున్నారు. ఇన్ని అవార్డులు తెలంగాణకు ఎందుకు వచ్చాయి. ఇక తెలంగాణకే అన్ని అవార్డులు వస్తుండటంతో భవిష్యత్లో అవార్డులను రద్దు చేస్తరేమో అనే అనుమానం ఉంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండి, కేవలం రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు అని హరీశ్రావు ధ్వజమెత్తారు.