హుజూరాబాద్ : భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్పై మంత్రి హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాధను ప్రజల బాధగా రుద్ది లాభపడాలని ఈటల రాజేందర్ చూస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజల బాధను, తమ బాధగా భావించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని హరీశ్రావు స్పష్టం చేశారు.
హుజురాబాద్ పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్లో భూమి ఆధీన, నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొని లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు అందించామని తెలిపారు. పని చేసే ప్రభుత్వం, పని చేసే నాయకుడు ఉంటే పని ఎంత వేగంగా జరుగుతుందో ఈ పంపిణీతో అర్థమవుతుంది. కొద్ది మంది నేతలు తమ బాధలను ప్రజల బాధగా రుద్ది లాభపడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధను, తమ బాధగా భావించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది అని హరీశ్రావు స్పష్టం చేశారు.
గడియారాలు, బొట్టుబిల్లలు ఇవ్వడం కాదు.. దమ్ముంటే సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పి హుజూరాబాద్ ప్రజలను ఓట్లు అడగాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్ధతు ఇస్తున్నారని చెప్పి సిలిండర్ ధర రూ. 3 వేలు, నూనె ధర రూ. 300కు పెంచుతారని హరీశ్రావు తెలిపారు. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలను తమ బాధలుగా భావించే వృద్దులకు ఆసరా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఇస్తోంది. మొన్న వరద వస్తే ఇంటికి రూ. 3800 సాయమందించామని హరీశ్రావు చెప్పారు.